అరుదైన అల్పపీడనం.. భారీ వర్షాలు, వరదల ప్రమాదం | Sakshi
Sakshi News home page

అరుదైన అల్పపీడనం.. భారీ వర్షాలు, వరదల ప్రమాదం

Published Fri, Oct 25 2013 8:43 AM

అరుదైన అల్పపీడనం.. భారీ వర్షాలు, వరదల ప్రమాదం

ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్నది చాలా అరుదైన అల్పపీడనమని వాతావరణ నిపుణులు నిర్ధారించారు. ప్రస్తుతం ఇది ఒంగోలు - గుంటూరు మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైందని, కొంత భాగం సముద్రంలోను, మరికొంత భాగం భూమి ఉపరితలం మీద ఉండటం వల్లే అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండటానికి కారణమైందని విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ ఓఎస్ఆర్యూ భానుకుమార్ తెలిపారు. ఈ పరిస్థితి వల్ల 2009 నాటి భారీ వర్షాలు పునరావృతం కానున్నాయని ఆయన చెప్పారు.

ఈ అల్పపీడనం ఎక్కువగా కదలకుండా అలాగే ఉండిపోతుందని, సముద్రంలోని కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని భానుకుమార్ అన్నారు. గతంలో 2009లో కూడా ఇలాంటి పరిస్థితే ఒకసారి సంభవించిందని, అప్పుడు తీవ్రస్థాయిలో వరదలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా అంతే తీవ్రస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అల్పపీడన ప్రభావం గుంటూరు, ప్రకాశం, కరీంనగర్ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందని, అలాగే శ్రీకాకుళం మీద కూడా కొంతవరకు ఉంటుందని వివరించారు. అయితే దీనికి తుఫానుగా మారేంత శక్తి లేదని, ఇలాగే ఉండి శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉందని ప్రొఫెసర్ భానుకుమార్ తెలిపారు.

Advertisement
Advertisement