ఆలమూరు, న్యూస్లూన్ :రహదారులపై నెత్తుటి మరకలు పడ్డాయి. ఆలమూరు మండలంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో తం డ్రీకొడుకులు ఉండడంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడికి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు నం ద్యాల ధనకృష్ణ(47), దుర్గాప్రసాద్ కలిసి మోటార్ బైక్పై వ్యక్తిగత పని కోసం బడుగువానిలంకకు వచ్చారు. తిరుగు ప్రయాణం లో చెముడులంక డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి బైక్ను విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న కారు ఢీకొంది. ధనకృష్ణ అక్కడికక్కడే మరణించగా, దుర్గా ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు అతడిని ప్రైవేటు వాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
మడికిలో విషాదఛాయలు
తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మడికిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ధనకృష్ణకు ముగ్గురు కుమారులుండగా, దుర్గాప్రసాద్ పెద్దవాడు. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, దుర్గాప్రసాద్ రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ కొత్తపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి సందర్శించారు. హైవేలోని చెముడులంక డివైడర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.నిర్మలతో ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లో డివైడర్ను పరిశీలిస్తామని పీడీ నిర్మల హామీ ఇచ్చారు.
ఆటో ఢీకొని మరొకరు..
ఆలమూరు-మండపేట రోడ్డులో సోమవారం ఆటో ఢీకొని ఓ వ్యక్తి మరణించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన నోచర్ల కిట్టయ్య (30) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పని కోసం వెళ్లాడు. పని పూర్తయ్యాక మోటార్ బైక్పై తిరుగు పయనమయ్యాడు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి అతడి బైక్ను ఆటో ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఏఎస్సై ఈ.నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.