ఘోరం.. | Sakshi
Sakshi News home page

ఘోరం..

Published Mon, Sep 2 2013 5:38 AM

Three people died on car accident

చొప్పదండి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లికి చెందిన షూమార్టు నిర్వాహకుడు మహ్మద్ షఫియుద్దీన్(38) తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఆసిఫాబాద్‌కు చెందిన సివి ల్ ఇంజినీర్ సయ్యద్ సలావుద్దీన్ అన్సారి(28), ఆటోమొబైల్ వ్యాపారి సయ్యద్ ఖలీద్(28)తో కలిసి నల్గొండ జిల్లాలో శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆసిఫాబాద్ నుంచి శనివారం రాత్రి బయల్దేరారు. సలావుద్దీన్ కారు నడుపుతుండ గా, షఫియుద్దీన్ ముందు సీట్లో, ఖలీద్ వెనుకసీట్లో కూర్చున్నారు. చొప్పదండి మండలం కొలి మికుంట గ్రామపంచాయతీ సమీపంలో మూల మలుపు వద్ద ఆదివారం వేకువజామున కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సంఘటన స్థలంలోనే చనిపోయారు. మూలమలుపు వద్ద కారు కుడివైపునకు తిరగాల్సి ఉండగా, ఎడమ వైపునకు దూసుకుపోయింది.
 
 ఆపై స్టీరింగ్‌ను కుడివైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనున్న చిన్న కల్వర్టు పైనుంచి ఎగిరిపడి చెట్టును వేగం గా ఢీకొంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అక్కడ చెట్టు లేకుంటే కారు పొలంలోకి దూసుకెళ్లి ప్రాణాలు దక్కేవి. మూలమలుపు వద్ద హె చ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం, రాత్రివేళ మద్యంమత్తులో మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే మూడు నిండుప్రాణాలు గాలిలో కలిసినట్లు భావిస్తున్నారు. సీఐ విజయసారథి, ఏఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలం నుంచి మృతదేహాలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు.
 
 చేతికొచ్చిన కొడుకు..
 ఆసిఫాబాద్‌లోని హడ్కో కాలనీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ హకీం అన్సారీకి కుమారుడు సలావుద్దీన్ అన్సారి, ముగ్గురు కుమార్తెలు సంతానం. సలావుద్దీన్ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. అతడికి 2008లో వివాహమైంది. ప్రస్తుతం సిర్పూర్(టి)లో ఉపాధిహామీ పథకంలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
 
 అన్నదమ్ములిద్దరూ రోడ్డు ప్రమాదంలోనే..
 కెరమెరి మండలం ధనోరాకు చెందిన సయ్యద్‌ఖలీద్ ఆసిఫాబాద్‌లో ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. జైనూర్‌కు చెందిన అలియా సుల్తానాతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అతడి అన్న సాదిక్ ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖలీద్ తండ్రి అజీజొద్దీన్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు కుటుంబానికి ఆధారంగా ఉన్న ఖలీద్ మరణించడంతో తల్లి, భార్యాపిల్లలు అనాథలయ్యారు.
 
 దిక్కులేనిదైన కుటుంబం..
 బెల్లంపల్లిలోని రాంనగర్‌కు చెందిన మహ్మద్ షఫీయొద్దీన్ తన అన్న రఫీతో కలిసి పాపులర్ షూమార్టు నిర్వహిస్తున్నాడు. షఫీయెద్దీన్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో భార్య రజియా, కొడుకు తౌఫిక్, కూతురు జువేరియా అనాథలయ్యారు. ఇంటినుంచి వెళ్లిన కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గుండెలవిసేలా రోదించారు.
 

Advertisement
Advertisement