ఇదెక్కడి పరేషన్ | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి పరేషన్

Published Fri, Jan 29 2016 12:06 AM

Three rounds Janmabhoomi program

కాకినాడ కలెక్టరేట్ :దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికార యంత్రాంగం పరిస్థితి. జిల్లాలో మూడు విడతలుగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. గత రెండు దల్ల్లో నిర్వహించిన జన్మభూమిలో దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. జిల్లాలో 1,34,680 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. వాటిని ఈ నెల 2 నుంచి 11 వరకూ నిర్వహించిన జన్మభూమిలో వాటిని పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాలు, వార్డుల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు.. రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరికి మాత్రమే కార్డులందాయి. అవి కూడా తప్పుల తడకలుగా ఉన్నాయి.
 
 యజమాని ఫొటో మాత్రమే కొన్ని కార్డుల్లో ముద్రితమైంది. కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో ఉన్నప్పటికీ, వారి ఫొటోలు లేవు. మరికొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లే లేవు. అవన్నీ సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు మినహా చర్యలు శూన్యం. కార్డుల్లో మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయంలోనే తప్పులు సరిచేస్తామని అధికారులు చెబుతుంటే, అవగాహన లేని కొంతమంది సిబ్బంది లబ్ధిదారులను మీ-సేవ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ కొత్తకార్డులు రావని చెబుతుండడంతో మళ్లీ తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు
 పెడుతున్నారు.
 
 పాత కార్డుదారులు మీ-సేవకే వెళ్లాలి
 జన్మభూమి కార్యక్రమంలో (జేఏపీ) రేషన్ కార్డు మంజూరైన వారు తప్పుల సవరణ, మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి మాత్రమే వెళ్లాలి. గతంలో పంపిణీ చేసిన ఏఏఓ, డబ్ల్యూఏపీ, ఆర్‌ఏపీ, టీఏపీ కార్డుదారులు తమ కార్డులో మార్పులుచేర్పుల కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
 

Advertisement
Advertisement