ప్రాణాలు తీశాయా..? | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీశాయా..?

Published Sat, Mar 15 2014 1:44 AM

Tisaya lives ..?

మూడేళ్లుగా కోర్టులో నలుగుతున్న భూతగాదా కేసు నేపథ్యంలోనే ఆ దంపతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారా  అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలు గురువారం రాత్రి మక్కువ మం డ లంలో హత్యకు గురయ్యారు. భూతగాదా కేసు వాయిదా శుక్రవారం ఉండగా ప్రత్యర్థులే మాటువేసి ముందు రోజు హత్యలకు  తెగబడ్డారని స్థానికులు, బంధువులు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామానికి చెందిన వేమల భాస్కరరావు(56), లక్ష్మీకాంతం(50) గురువారం రాత్రి హత్యకు గురైనా శుక్రవారం ఉదయం వరకూ బయట ప్రపంచానికి తెలియ లేదు. సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా, అది నిర్జన ప్రదేశం కావడంతో రాత్రంతా మృత్యువుతో  పోరాడి చివరకు ఓడిపోయారు. గ్రామానికి చెందిన  భాస్కరరావు అదే వెంకటభైరిపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భార్య లక్ష్మీకాంతం పాచిపెంట జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతం పనిచేస్తున్న పాఠశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆమె హాజరై తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఆటోలో శంబర వరకు ఆమె చేరుకోగా గ్రామం నుంచి భాస్కరరావు ద్విచక్రవాహనం తీసుకుని శంబర వెళ్లారు. 

రాత్రి సుమారు 9.30గంటల సమయంలో ఎస్.పెద్దవలస గ్రామం ముందు  తీళ్లవాని చెరువు వద్ద దారికాసిన దుండగులు ఇనుప రాడ్డుతో ఇద్దరి తలలపై బలంగా మోదడంతో  ఆ దంపతులు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావం అవడంతో భాస్కరరావు అక్కడే మృ  తి చెందారు. శంబర గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శుక్రవారం ఉదయం చూడడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పార్వతీపురం ఏఎస్‌పీ రాహుల్‌దేవ్ శర్మ సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీకాంతం కొనఊపిరితో ఉన్నట్లు గమనించి వెంటనే 108 వాహనంలో బొబ్బిలి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

పెద్దకుమార్తె నీలిమరాణి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి-భీమవరంలో, చిన్నకుమార్తె భారతీ దేవి విశాఖలో, కుమారుడు సాయిఅభిలాష్ ఒడిశాలోని రౌర్కెలాలో చదువుతున్నారు. పిల్లలు ముగ్గురు చదువుకునే వయసులో ఉండగా తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో వారు అనాథలయ్యారని బంధువులు, గ్రామస్తులు రోదించారు.
 

 తగాదా నేపథ్యం ఇది..
 

గ్రామానికి చెందిన అల్లు సత్యనారాయణకు, హత్యకు గురైన ఉపాధ్యాయ దంపతులకు మధ్య కొంతకాలంగా భూవివాదం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామసమీపంలో ఉన్న భూమిని  అల్లు సత్యనారాయణ తల్లి అప్పలనరసమ్మ    గతంలో భాస్కరరావుకు విక్రయిం చారు. అయితే అప్పట్లో తక్కువ ధరకు భూమిని అమ్మేశారని అపోహ పెట్టుకున్న సత్యనారాయణ మూడేళ్లుగా  భాస్కరరావుతో గొడవ పడుతున్నాడు. వీటిపై పోలీస్‌స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు.  శుక్రవారం బొబ్బిలి కోర్టులో వాయిదా ఉండగా గురువారం రాత్రి హత్యకు గురయ్యారు.
 

 మద్యం సేవించి...రాడ్డుతో బాది

 ఉపాధ్యాయ దంపతులు హత్యకు గురైన ప్రదేశానికి సమీపంలో హంతకులకు చెందిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. తీళ్లవాని చెరువు సమీపంలోని అరటితోటలో మద్యం సీసాలు, వాటర్ ప్యాకెట్లు, గారెలు వంటివి లభ్యమయ్యాయి. దీనిని బట్టి భా స్కరరావు ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళ్లడాన్ని గమనించి పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు అర్థమవుతోంది.. అలాగే హంతకుల్లో ఒకరి  సెల్‌ఫోన్, చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే దొరికింది. అయితే భూ తగదా జరుగుతున్న సత్యనారాయణపై అనుమానంతో పొలీసులు ఆరాతీయగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆదిశగా పోలీసు లు విచారణ మొదలు పెట్టారు.
 

 శోకసంద్రంలో గ్రామం

 గ్రామానికి చెందిన భార్యాభర్తలు హత్యకు గురికావడంతో గ్రామస్తులు  శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయ దంపతులు హత్య వార్త తెలుసుకుని మక్కువ, సాలూరు ,పాచిపెంట మండలాలనుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు   పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 

సంఘటన స్థలానికి చేరుకున్న నాయకులు

 హత్య జరిగిన విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీడిక రాజన్నదొర, మక్కువ మండలం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బొంగుచిట్టినాయుడు, లండ నరసింహమూర్తి, బొమ్మి కృష్టమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయుల మృతదేహాలను చూసి విచారం వ్యకం చేశారు. సాలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.భంజ్‌ధేవ్, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, మండలకాంగ్రెస్‌నాయుకులు మావుడి రంగునాయుడు, మండలటీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు, సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.  
 
 

Advertisement
Advertisement