నేడు వైఎస్ జగన్ రాక | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్ జగన్ రాక

Published Fri, Mar 6 2015 2:33 AM

నేడు వైఎస్ జగన్ రాక - Sakshi

భీమవరం :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భీమవరం రానున్నారు. రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి వివాహం శుక్రవారం భీమవరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడకు రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు కుమారుడు వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా భీమవరం చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.

వివాహానికి హాజరుకానున్న షర్మిల

శుక్రవారం రాత్రి జరగనున్న లేఖ్యరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి వివాహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల హాజరుకానున్నారు. జువ్వలపాలెం రోడ్డులోని వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.
 

Advertisement
Advertisement