31,1 తేదీల్లో ’రవాణా’ సేవలు బంద్ | Sakshi
Sakshi News home page

31,1 తేదీల్లో ’రవాణా’ సేవలు బంద్

Published Mon, May 26 2014 3:03 AM

transport services bandh on 31st , 1st

సాక్షి, కర్నూలు: విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ రెండు రోజుల పాటు రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం త్రీ టైర్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా రవాణాశాఖ ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తోంది. దీని ప్రధాన సర్వర్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మే 31, జూన్ 1 తేదీల్లో ప్రధాన సర్వర్‌ను పూర్తిగా ఆపేయనున్నారు. దీంతో డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. దీంతోపాటు వాహనాల విక్రయ సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ సంఖ్య(టీఆర్ నంబరు)ను జారీ చేయాలన్నా రవాణాశాఖ ప్రధాన సర్వర్‌తో అనుసంధానం కావాల్సి ఉండడం, ఆ నంబరు లేకుండా వాహనాలు రోడ్డెక్కే అవకాశం లే కపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు రోజులపాటు షోరూములో వాహనా విక్రయాలు కూడా సాగే పరిస్థితి లేదు. వాహనాలకు సంబంధించి వివిధ రకాల పన్ను, లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సుల రుసుములకు సంబంధించి ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లింపులు కూడా ఆగిపోతాయి.

  29, 30 తేదీల్లో అదనపు పని గంటలు
 మే 31, జూన్ ఒకటో తేదీల్లో సేవలు నిలిచిపోనున్నందునా అందుకు ప్రతిగా మే 29, 30 తేదీల్లో అదనపు గంటలు పని చేసేందుకు రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30  నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కౌంటర్‌లో సేవలు అందిస్తారు. మే 29, 30 తేదీల్లో మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

Advertisement
Advertisement