‘పోలవరం’ వద్దు | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ వద్దు

Published Thu, Feb 13 2014 2:31 AM

Tribal communities demands to stop polavaram construction in bhadrachalam

 భద్రాచలం, న్యూస్‌లైన్ : పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ  ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ  భద్రాచలంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక  ఆధ్వర్యంలో బుధవారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించిన ఆదివాసీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 ఈ సందర్భంగా కొండరెడ్ల జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్, తుడుందెబ్బ, ఏవీఎస్‌పీ రాష్ట్ర నాయకులు వట్టం నారాయణ, సున్నం వెంకటరమణ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 205 ఆదివాసీ గూడేలను పోలవరంలో ముంచేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కేసీఆర్ అనుకూలంగా ఉండటం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సమన్వయ కర్త మడివి నెహ్రూ, కొర్సా చినబాబు దొర, వెకంటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో దీక్షలు :
  మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో చేపట్టిన నిర సన దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎంఎస్‌పీ నాయకులు రావులపల్లి నర్సింహారావు, వైవీ రత్నంనాయుడు ప్రారంభించారు. ఎంఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి యాతాకుల భాస్కర్ మాదిగ, గొడ్ల మోహన్‌రావు మాట్లాడారు. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు కొంతమంది స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

దీక్షలకు న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు కొడాలి శ్రీనివాస్, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, ఐఎమ్‌ఏ నుంచి వైద్యులు శ్యాంప్రసాద్, సుదర్శన్, అజిత్ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షల్లో సోమయ్య, ఆనందరావు, సందీప్, రవికుమార్, కిరణ్, నరేష్, రాము, బ్రహ్మానందరావు, సాలయ్య, శ్రీను, రమణయ్య, రాజు, సుందరం, రాములు, అనీల్ కుమార్, అశోక్ తదితరులు కూర్చొన్నారు. దీక్షలకు పీఆర్ ఉద్యోగుల సంఘం నాయకులు గౌసుద్ధీన్, మందల రవి, అలవాల రాజా తదితరులు సంఘీభావం పకటించారు.

Advertisement
Advertisement