Sakshi News home page

రైల్వేలో రెండు లక్షల పోస్టులు ఖాళీ

Published Tue, Oct 24 2017 1:06 PM

two lakh posts empty in south central railway

సామర్లకోట: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో లక్ష పోస్టులు సేఫ్టీ డిపార్టుమెంటుకు చెందినవే ఉన్నాయని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ కోశాధికారి సీపీఎస్‌ శర్మ తెలిపారు. సామర్లకోట, కాకినాడల బ్రాంచిల సర్వసభ్య సమావేశం సందర్భంగా బ్రాంచి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోస్టుల భర్తీకి తమ సంఘం డిమాండ్‌ చేస్తూ అనేక ఆందోళనలు చేస్తున్నామన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్టు కార్మికులను తమ సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటున్నామన్నారు. రైల్వేలోనూ అనేక యూనియన్లు వస్తున్నాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 30 శాతం ఓటింగ్‌ ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందన్నారు. ఈ మేరకు రెండు యూనియన్లు గుర్తింపు పొందాయని తెలిపారు. బీజెపీ ప్రభుత్వం యూనియన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

బుల్లెట్‌ ప్రూప్‌ రైళ్లు ఎవరి కోసం?
బుల్లెట్‌ ప్రూప్‌ రైళ్ల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జపాన్‌ సాయంలో రూ.2,500 కోట్లతో ఈ రైళ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సామాన్య ప్రజలకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశం ప్రమాద స్థితికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజనల్‌ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్రరావు, కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు, డివిజనల్‌ మాజీ సహాయ కార్యదర్శి కేవీవీ రావు, బ్రాంచి అధ్యక్షుడు ఎం.సాయిబాబు, కార్యదర్శి ఎం.రమేష్‌ పాల్గొన్నారు.

కాకినాడ బ్రాంచి అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
ఎస్‌సీఆర్‌ ఎంప్లాయీస్‌ సంఘ్‌ కాకినాడ బ్రాంచి అధ్యక్షుడిగా సీహెచ్‌ శ్రీనివాసరావు, వర్కింగ్‌ చైర్మన్‌గా జీవీ శివానంద్, ఉపాధ్యక్షులుగా ఎస్‌.ప్రసన్నకుమార్, ఎస్‌వీఆర్‌ నాయుడు, జీవీవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులుగా ఎస్‌వీ కిరణ్‌కుమార్, ఇ అప్పలనాయుడు, డీవీవీ సత్యనారాయణ, కోశాధికారిగా టి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

సామర్లకోట బ్రాంచి అధ్యక్షుడిగా ఈశ్వరరావు
సామర్లకోట బ్రాంచి అధ్యక్షుడిగా పి.ఈశ్వరరావు, వర్కింగ్‌ చైర్మన్‌గా బి.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌ చిరంజీవి, కేవీకే గోపాల్‌రెడ్డి, ఎన్‌.నారాయణరావు, కార్యదర్శిగా ఎం.రమేష్, సహాయ కార్యదర్శులుగా బీవీ రమణ, కేవీ ప్రసాద్, ఎన్‌.సత్యనారాయణ, కోశాధికారి కె.రాధాకృష్ణ ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement