ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

Published Thu, Sep 26 2019 9:59 AM

Two SI And Constable Suspended In Krishna District - Sakshi

సాక్షి, మచిలీపట్నం: విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇరువురు ఎస్‌ఐలు, ఓ కానిస్టేబుల్‌పై జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ రవీంద్రనాథ్‌బాబు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన మెగా లోక్‌ అదాలత్‌లో ఓ కేసులో రాజీ చేసే క్రమంలో బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి పెనుగంచిప్రోలు ఎస్‌ఐ ఎండీ అష్ఫాక్‌ భారీగా డబ్బులు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించగా వాస్తవమని తేలడంతో ఎస్‌ఐపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఐజీకి నివేదిక సమర్పించారు. అదే విధంగా కైకలూరు టౌన్‌ పరిధిలోని అయోధ్యపురంలో పేకాట శిబిరంపై జరిపిన దాడిలో 2.10 లక్షల నగదు, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులో నిందితులకు సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న కలిదిండి ఎస్‌ఐ వై.సుధాకర్, రూరల్‌ కానిస్టేబుల్‌ రజనికుమార్‌ (పీసీ నం.2365)లపై సమగ్ర విచారణ జరిపించి డీఐజీకి నివేదిక సమర్పించారు. డీఐజీ ఆదేశాల మేరకు ఈ ఇరువురు ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుల్‌లపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

అవినీతి రహిత పోలీసింగ్‌ దిశగా..
పోలీస్‌ శాఖలో అవినీతి పరులపై జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ రవీంద్రనాథ్‌ బాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే ఊపేక్షించడం లేదు. పైగా ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లలో రోజువారీ కార్యకలాపై ప్రత్యేక నిఘా ఉంచారు. గతంలో నాగాయలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు సహకరించిన కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్‌ను, అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న వారికి సహకరించిన కానిస్టేబుల్‌ రమే‹ష్‌ను కూడా ఇదే విధంగా సస్పెండ్‌ వేశారు. అవినీతి రహిత పోలీసింగ్‌ కోసం ఎస్పీ రవీంధ్ర నాథ్‌ బాబు తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదు
పోలీస్‌ శాఖలో విధి నిర్వహణలో అలసత్వాన్ని గానీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని గానీ ఊపేక్షించేది లేదు. పోలీస్‌ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. ప్రత్యేక బృందాలతో ప్రతి ఒక్కరి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అవినీతి రహిత పోలీసింగ్‌ కోసం కృషి చేస్తున్నాం.
– రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, కృష్ణా జిల్లా

Advertisement
Advertisement