విద్యార్థుల కిడ్నాప్.. చంపేస్తామని బెదిరింపు | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కిడ్నాప్.. చంపేస్తామని బెదిరింపు

Published Wed, Dec 3 2014 6:52 PM

two students childlifted, parents get threatening calls

కృష్ణాజిల్లా అవనిగడ్డలో విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శ్రవణ్, మల్లికార్జున్ అనే ఇద్దరు పిల్లలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దాంతో వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన ముగ్గురు పిల్లలు రోజూ ఆర్టీసీ బస్సులో అవనిగడ్డకు వచ్చి అక్కడ హైస్కూల్లో చదువుకుంటారు. బుధవారం ఉదయం అలాగే ముగ్గురూ వచ్చారు. వాళ్లలో ఒకవిద్యార్థి తనకు గొంతు నొప్పిగా ఉందని అవనిగడ్డ వెళ్లాక గొంతు నొప్పిగా ఉందని మెడికల్ షాపుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి మిగిలిన ఇద్దరు కనిపించలేదు. స్కూల్లో కూడా లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారనుకున్నాడు.

కానీ మధ్యాహ్నం వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. పిల్లలను చంపేస్తామని ఆ ఫోన్ చేసినవాళ్లు బెదిరించారు. పిల్లల తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటుండగా ఈ ఫోన్లు వచ్చాయి. వాళ్లు మొదట దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ సాయంత్రానికి కూడా పిల్లలు రాకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. కాల్ వచ్చిన నెంబరు పనిచేస్తున్న టవర్ను ట్రాక్ చేయగా.. విజయవాడ కృష్ణలంలకలో నారాయణరావు అనే వ్యక్తి నెంబరు నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అవనిగడ్డ పోలీసులు విజయవాడ వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement