గల్ఫ్‌లో ఇద్దరు మహిళల విక్రయం! | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో ఇద్దరు మహిళల విక్రయం!

Published Wed, May 10 2017 2:12 AM

Two women sell in Gulf

హైదరాబాద్‌ ముఠా సభ్యులను విచారణ చేస్తున్న పోలీసులు

ఇబ్రహీంపట్నం (మైలవరం): ఉపాధి చూపుతామని ఆశ చూపి గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్లిన ఇద్దరు మహిళలను ఓ ముఠా అక్కడి సేట్‌లకు విక్రయించారని కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో మంగళవారం కలకలం రేగింది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఓ ముఠా సభ్యులు తొమ్మిది నెలల క్రితం ఐదుగురు మహిళలకు మస్కట్‌ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. మైలవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ద్వారా ఆ సభ్యులు మహిళల నుంచి డబ్బులు గుంచి ఇద్దరిని తొలివిడతగా మస్కట్‌ పంపించారు.

అక్కడ వారు కష్టాలు భరించలేక తిరిగి గ్రామానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు మహిళలను తీసుకెళ్లేందుకు కొండపల్లి వస్తున్నట్లు హైదరాబాద్‌ నుంచి ముఠా సభ్యులు మంగళవారం స్థానిక మహిళకు సమాచారం ఇచ్చారు. ముందుగా మస్కట్‌ వెళ్లిన మహిళలను అక్కడి సేట్‌కు విక్రయించారని, దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న స్థానికులు ముఠా వివరాలను పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్న పదిమంది సభ్యుల్లో ఇద్దరిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అనంతరం వారిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారని సమాచారం.

Advertisement
Advertisement