బైక్ బోల్తా కొట్టి ఇద్దరు యువకుల మృతి | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తా కొట్టి ఇద్దరు యువకుల మృతి

Published Wed, Feb 26 2014 1:39 AM

two young people died in road accidents

కండ్లకుంట (వెల్దుర్తి), న్యూస్‌లైన్ :మండలంలోని కండ్లకుంట - కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య  మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం బోల్తా కొట్టి ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. గుడిపాడుచెరువు గ్రామానికి చెందిన శీలం శ్రీను (28), మండ్లి అంజి (22) స్నేహితులు. వ్యక్తిగత పనుల నిమిత్తం కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కండ్లకుంట శివారులో ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గోడకు ఢీకొని బోల్తా కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మండ్లి అంజి కర్నూలు జిల్లా సుండిపెంటలోని రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇటీవల రాజీవ్ యువకిరణాలు సంక్షేమ పథకం కోసం సుండిపెంటలో శిక్షణ పొందుతున్నాడు. మహాశివరాత్రి పం డుగ గుడిపాడుచెరువుకు వారం రోజుల కిం దట వచ్చాడు. మృతుడు శీలం శ్రీను వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 
 మిన్నంటిన రోదనలు..
 
 ఇద్దరు యువకుల మరణవార్త విన్న గుడిపాడుచెరువు గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కన్నకొడుకు చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని కుటుంబాన్ని పోషిస్తాడని ఆశ పడితే కానరాని లోకానికి వెళ్లాడని అంజి తండ్రి గురుస్వామి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. ఊరికి వెళ్లి వస్తానని చెప్పి పరలోకానికి వెళ్లావయ్యా.. ఇంక మాకు దిక్కెవరయ్యా .. అని శ్రీను భార్య వెంకటమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
 

Advertisement
Advertisement