వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు | Sakshi
Sakshi News home page

వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు

Published Fri, Sep 6 2019 2:35 PM

Union Minister Giriraj Singh Visited the Shrimp Production Industry in Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు.

రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్‌ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్‌ రాం శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement