ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి

Published Wed, Jan 1 2014 3:28 AM

urban development as planned

కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల మంజూరుపై చూపిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై చూపకపోవడం సరికాదని అధికారులకు హితవు పలికారు. డంపింగ్ యార్డులు లేనిచోట తహసీల్దార్లను సం ప్రదించి స్థలాలు సేకరించాలని సూచిం చారు.

 ఒకప్పుడు ఆదర్శ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేటలో నేడు పారి శుద్ధ్యం కొరవడిందని అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల గొట్టాలపై దోమల బెడద నివారించేందుకు నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదని వా రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా విషయాలపై వెంటనే మున్సిపల్ కమిషనర్లకు మెమోలు జారీ చేయాలని మెప్మా పీడీని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటిపై విధిగా మూడో బృందంతో విచారణ చేయించాలని సూ చించారు.

 పట్టణ ప్రాంతంలో ఉన్న బాలకార్మికులను రెసిడెన్షియల్, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు, బ్రిడ్జి కోర్సులలో చేర్పించాలని సూచిం చారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను మార్చి నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు మొక్కుబడిగా సమావేశానికి హాజరైతే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఆమోస్, నల్లగొండ ఆర్డీఓ జహీర్, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లాఆడిట్ అధికారి సీహెచ్.వేణుగోపాల్‌రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అశ్విని, కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement