కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వరి రైతులు సోమరిపోతులంటూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించడంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం భగ్గుమంది. ఆయనకు విచక్షణా ఉందా? పిచ్చేమైనా పట్టిందా అని ఘాటుగా విమర్శించింది. వెంటనే రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో సీఎం చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అని వాఖ్యానించగా..దేశంలోని 50 శాతం మందికి అన్నం పెట్టే వరి రైతు సోమరులు అంటూ మంత్రి ఉమామహేశ్వరావు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏ వాణిజ్య పంటకు గిట్టుబాటు ధరలు కల్పించారో మంత్రి బహిరంగ చర్చకు రావాలన్నారు. కంది, పత్తికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీరేమార్గం కనిపించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పర్ల శ్రీధర్రెడ్డి, జిల్లా నాయకులు కరుణాకరరెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.