అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే | Sakshi
Sakshi News home page

అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే

Published Mon, Sep 16 2019 8:40 AM

 Very Risky for Boats at Kachaluru in Godavari - Sakshi

దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: వరదల సమయంలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం ప్రాంతాన్ని దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే. ఎంతో అనుభవం గల సరంగులు సైతం అక్కడ సుడిగుండాలను దాటి వెళ్లడానికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆదివారం బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం కూడా అదే. వరద సమయంలో భద్రాచలం నుంచి వచ్చే వరద నీరు పాపికొండలు నుంచి కొండమొదలు వరకు వేగంగా ప్రవహిస్తూ.. కచ్చులూరు వద్ద కొండను తాకి సుడులు తిరుగుతుంది. ప్రమాదానికి గురైన బోటు నడిపిన సరంగులు సంగాడి నూకరాజు, సత్యనారాయణ ఆ ప్రాంతం వద్ద గోదావరి ఉధృతిని అంచనా వేయడంలో విఫలమయ్యారని స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా సరంగులు మంటూరు నుంచి బోటును నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తూటుగుంట వైపునకు మళ్లించి.. గోదావరి ఒడ్డు వెంబడి నడుపుతారు. తరువాత తూర్పు గోదావరి జిల్లాలోని గొందూరు వైపు ప్రయాణం చేస్తారు. ప్రమాదానికి గురైన బోటు నడిపిన సరంగులు నేరుగా కచ్చులూరు మందం వైపు ప్రయాణించారు. దీనివల్ల బోటు ప్రమాదానికి గురై మునిగిపోయింది. గోదావరిపై పోశమ్మ గండి వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేయడంతో టూరిజం బోటు పాయింట్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సింగన్నపల్లి కంపెనీ వద్ద, తూర్పు గోదావరి జిల్లా పోశమ్మ గండి వద్ద అనధికారికంగా ఏర్పాటు చేశారు. గతంలో ఈ బోటు పాయింట్లు పురుపోత్తపట్నం, పట్టిసీమ వద్ద ఉండేవి. దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ మీదుగా పాపికొండలుకు వెళ్లే ప్రతి బోటును అక్కడి పోలీసులు తనిఖీ చేసేవారు. సింగన్నపల్లి నుంచి బయలుదేరిన ఈ బోటును తనిఖీ చేసేందుకు ఎక్కడా పోలీస్‌ స్టేషన్లు లేవు.  

సంబంధిత వార్తలు...

నిండు గోదారిలో మృత్యు ఘోష

ముమ్మరంగా సహాయక చర్యలు

మేమైతే బతికాం గానీ..

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

కన్నీరు మున్నీరు
 

Advertisement
Advertisement