రేషన్ షాపులపై విజిలెన్స్‌ దాడులు | Sakshi
Sakshi News home page

రేషన్ షాపులపై విజిలెన్స్‌ దాడులు

Published Wed, Apr 13 2016 2:04 AM

Vigilance attacks on Ration shops

జి.మామిడాడ(పెదపూడి) : జి.మామిడాడ గ్రామంలోని ఐదు రేషన్ షాపులపై రాజమండ్రికి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నాలుగు షాపుల్లో సరకులు సీజ్ చేశారు. తహసీల్దార్ ఎం.సావిత్రి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు తెలిపారు. జి.మామిడాడ గ్రామంలోని 20, 22, 23, 24, 25 నంబర్ల షాపులపై విజిలెన్స్ తహ సీల్దార్ గోపాలరావు, డీసీటీఓ రత్నకుమార్, ఎస్సై సత్యనారాయణ తమ సిబ్బందితో ఏకకాలంలో మూడు షాపులపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 22వ షాపులో రూ.2,386 విలువైన రేషన్ సరకును సీజ్ చేశారు. బియ్యం రికార్డులకంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

పంచదార 105 కిలోలు తక్కువగా, కిరోసిన్ 4 లీటర్లు ఎక్కువగా ఉంది. 23వ షాపులో రూ.9,994 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 1,924 కిలోలు, పంచదార 14 కిలోలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కిరోసిన్ 344 లీటర్లు ఎక్కువగా ఉంది. 24వ షాపులో రూ.7,317 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 288 కిలోలు, పంచదార 27 కిలోలు, కిరోసిన్ 282 లీటర్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 25వ షాపులో రూ.4,721 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 47 కిలోలు, కిరోసిన్ 42 లీటర్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 20వ నంబర్ షాపులో సరకు వ్యత్యాసం లేదు.

నాలుగు రేషన్ షాపుల నిర్వహణ బాధ్యతలను వేరేవారికి అప్పగించారు. సరకు తేడా ఉన్న షాపుల నిర్వాహకులపై నిత్యావసర సరకుల చట్టం ప్రకారం ెకేసు నమోదు చేయనున్నట్టు తహసీల్దార్ సావిత్రి, ఎంస్‌ఓ కె.విశ్వేశ్వరరావు తెలిపారు.

Advertisement
Advertisement