విజయమ్మ దీక్ష భగ్నంపై ఆగ్రహ జ్వాలలు | Sakshi
Sakshi News home page

విజయమ్మ దీక్ష భగ్నంపై ఆగ్రహ జ్వాలలు

Published Sun, Aug 25 2013 3:23 AM

Vijayamma initiated offended the flames of resentment

 రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయూలని, అలా కాకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్‌చేస్తూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి భగ్నం చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ శనివారం నిర్వహించిన  జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. 
 
 జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నాయని, ఈ రెండు పార్టీలకు పుట్టగతులుండవని, ప్రజల ఆగ్రహానికి అవి భూ స్థాపితం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణదీక్ష భగ్నం, అరెస్టుకు నిరసనగా శనివారం   రాష్ట్ర ప్రధాన రహదారిపై బాలారాజు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమన్యాయం కోసం అందరికి మేలు జరిగేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధ రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అరె స్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కనీసం అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకుండా పోలీస్ వాహనంలో తరలించడాన్ని విమర్శించారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని, ఇలాంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. 
 
 రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. రాష్ట్రం తగులబడుతుంటే ఢిల్లీలో సోనియాగాంధీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖబడ్దార్ సోనియా అంటూ హెచ్చరించారు. చంద్రబాబు బస్సుయాత్రను ప్రజలు అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావూరి కృష్ణ, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, రాఘవరాజు ఆదివిష్ణు, మార్ని ప్రసాద్, కాసర సురేష్‌రెడ్డి, గూడపాటి రాధాకృష్ణ, నౌడు అశోక్ , కొయ్యే లీలాధర్‌రెడ్డి, కాసర సోమిరెడ్డి, పి.సుదర్శన్, పితాని రాజేశ్వరి పాల్గొన్నారు. 
 
 సోనియా దిష్టిబొమ్మ దహనం
 పాలకొల్లు టౌన్ : విజయమ్మ దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు.  దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక గాందీబొమ్మల సెంటర్‌లో రోడ్డుపై బైఠారుుంచారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు.
 
 సీమాంద్రప్రాంతంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మేధావుల వరకు సమైక్యాంధ్రను కోరుతూ ఎన్ని ఆందోళనలు చేపట్టినా సోనియాగాంధీ మొండి వైఖరి అవలంభించడం సరికాదన్నారు. తక్షణమే స్పందించి సమైక్య ప్రకటన చేయూలని డిమాండ్‌చేశారు. పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, ఆకెన వీరాస్వామి(అబ్బు), సంగినీడి సూరిబాబు, చీకట్ల వరహాలు, యడ్ల తాతాజీ, మద్దా చంద్రకళ, నడిం పల్లి అన్న పూర్ణ పాల్గొన్నారు.
 
 అప్రజాస్వామికం
 చింతలపూడి, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో చింతలపూడి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.  రాజేష్ మాట్లాడుతూ విజయమ్మ దీక్ష భగ్నం అప్రజాస్వామికమన్నారు. తలా కాస్తా  పంచుకోవడానికి రాష్ట్రం కేకు ముక్క కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మండల కన్వీనర్ టి. వెంకట్రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పి. వినోద్‌రెడ్డి, జె. జానకీరెడ్డి, చేపూరి ఖాదర్‌బాబు, టీడబ్ల్యూ జయరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జి. రమణయ్య, ఎండీ సాదిక్, నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 
 
 దీక్ష భగ్నం దారుణం
 తణుకు, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ  దీక్షను పోలీసులు భగ్నం చేయటం దారుణమని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా శనివారం తణుకులో బంద్ చేపట్టారు.  పట్టణంలో  బైక్ ర్యాలీ నిర్వహిం చారు. జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వార్ధప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ఈ విషయాన్ని గుర్తించి సీమాంధ్ర ప్రజలందరూ సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు విడివాడ రామచంద్రరావు, కరుటూరి పాండురంగారావు, కారుమంచి మిత్రా, బొబ్బిలి సుధీంద్రబాబు, నాసరి రాజారామ్, గంధం బాబ్జి, కంచుమర్తి విశ్వేశ్వరరావు, గోడి నాగబాబు, నత్తా చంద్రశేఖర్, కొప్పోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement