‘2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించాం’ | Sakshi
Sakshi News home page

‘2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించాం’

Published Mon, Dec 30 2019 3:17 PM

Vijayawada CP Dwaraka Tirumala Rao Says 2019 Crime Report - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తొలిసారి విజయవాడ రూరల్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌కు టెక్నాలజీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరులమరావు తెలిపారు. 2019 వార్షిక మీడియా సమావేశాన్ని సీపీ ద్వారకాతిరుమలరావు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించామన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ప్రముఖుల ప్రమాణస్వీకారాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.  పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద వచ్చిందని.. దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. 2019లో ఎఫ్‌ఐఆర్‌ నమోదులు తగ్గాయని.. బైండోవర్ కేసులు పెరిగాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 25 శాతం, హత్యాయత్నం కేసులు 52 శాతం, దాడుల కేసులు 24 శాతం, ప్రాపర్టి అఫెన్స్ కేసులు 18 శాతం, వరకట్నం కేసులు 45 శాతం తగ్గాయన్నారు. దొంగతనం కేసులు 21 శాతం, మర్డర్ కేసులు 19 శాతం, గృహహింస కేసులు 11 శాతం పెరిగాయని  సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

వీటితోపాటు పోక్సో కేసులు 2018లో 95 కేసులు, 2019లో 67 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేసులు, ఘరానామోసాలు తగ్గాయన్నారు. కాగా, 2018లో 498 కేసులు, 2019లో 463 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని.. 2018లో 191, 2019లో 242 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులో ప్రాపర్టీ రికవరీ గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది ఎక్కవగా చేశామన్నారు. మిస్సింగ్ కేసులు తగ్గాయని 2018లో 788, 2019లో 624 కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 199 మంది మగపిల్లల్ని, ఐదుగురు ఆడపిల్లలను గుర్తించామని సీపీ వెల్లడించారు. 

రోడ్డు ప్రమాదాలు తగ్గంచగలిగామని.. 2018లో 1,483 కేసులు, 2019లో 1,376 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. 2019 టాస్క్ ఫోర్స్ కేసుల్లో కీలకమైనవి.. క్రికెట్ బెట్టింగ్, నకిలీ బంగారం, విదేశి సిగిరెట్లు, డ్రగ్స్, నకిలి సర్టిఫికెట్స్ కేసులని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్‌తో పాటు అత్యాచారం, మిస్సింగ్ లాంటి చాలా కీలకమైన కేసులను 2019లో చేధించగలిగామని సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలు ప్రారంభించామని.. సైబర్ మిత్ర పేరుతో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామమని సీపీ తెలిపారు.

గడిచిన ఆరునెలల్లో 2,968 స్పందన పిటిషన్లు వచ్చాయని.. 2,961 పిటిషన్లను పరిష్కరించామన్నారు. కేవలం 7 పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 379 పిటిషన్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమొదు చేశామన్నారు. రూ.10 కోట్లతో మాచవరం, ఉయ్యూరు, కంకిపాడు పోలీసు స్టేషన్లను నిర్మించామని అయన పేర్కొన్నారు. రూ.2.75 కోట్లతో కృష్ణలంక, భవానిపురం, సత్యనారాయణపురంలో పోలీసుల స్టేషన్ల భవన నిర్మాణం జరగుతుందన్నారు. డయిల్ 100కు 3,06,036 కాల్స్ వచ్చాయని.. 72,889 కాల్స్ మాత్రమే నిజమైనవని, మిగిలిన 2,33,147 కాల్స్ ఆకతాయిలు చేసిన నకిలీవి వచ్చాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

Advertisement
Advertisement