విజయవాడ రైళ్లు మళ్లింపు | Sakshi
Sakshi News home page

విజయవాడ రైళ్లు మళ్లింపు

Published Wed, Sep 7 2016 3:56 AM

విజయవాడ రైళ్లు మళ్లింపు

- 20 నుంచి 28 వరకు అమలు
- కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ ప్రభావం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే సేవల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ (రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.అతి పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడకు అన్ని వైపుల నుంచి వచ్చే రైళ్లను దశలవారీగా నిలిపివేస్తూ, రూటు మళ్లిస్తూ కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టనున్నా రు. ఈ క్రమంలో ఈ నెల  20 నుంచి  28 వరకు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లు పాక్షికంగా రద్దవుతాయి. మరో 215 రైళ్లను  దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం నిలిచిపోతాయి. ఈ దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలు, మార్గాలలో సైతం తగిన సవరణలు చేసుకోవడం మంచిదని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచిస్తున్నారు. 

 హైదరాబాద్-విజయవాడ
రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు....

 హైదరాబాద్-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి  25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఈ ట్రైన్‌లను ఏలూరు, విజయవాడ బైపాస్ కొండపల్లి స్టేషన్‌ల మీదుగా నడుపుతారు.

 ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది.

 ముంబై సీఎస్‌టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు.

 పట్నా-బెంగళూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, దర్భంగ-మైసూర్ బాగ్‌మతి ఎక్స్‌ప్రెస్, జమ్ముతావి-చెన్నై సెంట్రల్ మధ్య నడిచే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. వరంగల్, విజయవాడ , ఒంగోలు, నెల్లూరు, గూడూరు మార్గంలో కాకుండా బల్లార్ష, వరంగల్, కాచిగూడ, డోన్, గుత్తి, రేణిగుంట మార్గంలో(ఈ నెల 20, 21 తేదీలలో మాత్రమే) రాకపోకలు సాగిస్తాయి.

 సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లు.. కాజీపేట్, ఖమ్మం మార్గంలో కాకుండా పగిడిపల్లి-నడికుడి మీదుగా గుంటూరుకు రాకపోకలు సాగిస్తాయి.

 నర్సాపూర్-నాగర్‌సోల్, విశాఖపట్టణం-హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్-మచిలీపట్నం, కాకినాడ-బెంగళూర్, హైదరాబాద్-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ గరీబ్థ్,్ర సికింద్రాబాద్-కాకినాడ మధ్య నడిచే కాకినాడ  ఎక్స్‌ప్రెస్, ముంబై లోకమాన్య తిలక్-విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కోల్‌కత్తా షాలిమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గువాహటి, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్,తదితర రైళ్లను విజయవాడ-కొండపల్లి బైపాస్ మార్గంలో, గుడివాడ-విజయవాడ బైపాస్ మార్గంలో నడుపుతారు. ఈ రైళ్లు విజయవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించవు.

Advertisement
Advertisement