సాక్షి, విశాఖపట్నం:తుమ్మపాల సుగర్స్లో 22 మంది రెగ్యులర్, 250 మంది దినసరి కార్మికులుగా పని చేస్తున్నాం. యాజమాన్యం పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదు. దినసరి కార్మికులకు నెలకు రూ.10వేలు, రెగ్యులర్ కార్మికులకు రూ.18వేలు చెల్లిస్తోంది. 150 మంది రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించలేదు. 48 నెలల నుంచి జీతభత్యాలు చెల్లించకపోవడంతో జీవనం దుర్భరంగా మారింది. జీతభత్యాలు, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు కలిపి కార్మికులకు సుమారు రూ.15కోట్లు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక 2014 నుంచి కార్మికుల ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. బెంగతో, అనారోగ్యంతో 39 కార్మికులు మరణించారు. మా సమస్యలను గురువారం తుమ్మపాల వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించాం. ఆయన ఎంతో ఓపికగా విన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చక్కెర కర్మాగారాల్లో కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
పథకాలన్నీ టీడీపీ వాళ్లకే
మా భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నా.కనీసం బోరు వేసుకునే పరిస్థితి మాకు లేదు. ఉన్న ఎకరా భూమిని వర్షాధారంపై వరి పండిస్తాను. మా చుట్టు పక్కల చాలా మంది రైతుల పరిస్థితి కూడా ఇదే. జలసిరి పథకం వచ్చినా, మిగిలిన ఏ పథకాలు వచ్చినా టీడీపీ వేళ్లే లాగేసుకుంటున్నారు. మా లాంటి చిన్నకారు రైతులంతా సాగుకు నీరు అందక ఏటా నష్టపోతున్నాం. మీరు అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుని, పంటలకు సాగునీరు అందించేలా చూడాలన్నా అని అనకాపల్లి మండలం బవులవాడ గ్రామానికి చెందిన రైతు మార్టూరు శ్రీనివాసరావు ఎండిపోయిన పంటను చూపించి, పాదయాత్రలో జగన్తో కలిసి నడుస్తూ తన సమస్యలను చెప్పుకున్నాడు.