గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ | Sakshi
Sakshi News home page

గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్

Published Thu, Jan 1 2015 4:11 AM

గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ - Sakshi

 అర్ధవీడు (కంభం రూరల్) : గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల గ్యాప్ నుంచి తాగునీటిని అందించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను 600 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధవీడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రజాసదస్సు నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల ప్రజలు తాగునీటి  సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
 
 దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాభావం వల్ల వేసవిలో తాగునీటి ఎద్దడి  తీవ్రంగా ఉంటున్న విషయాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాకర్ల గ్యాప్ నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్లు వేసి తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్‌ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ైరె తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన వెంటనే గ్రామాలకు తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్ ను అధికారులు ప్రారంభిస్తారని చెప్పారు.
 
 నిధులను దుర్వినియోగం చేయొద్దు
 మండల అభివృద్ధికి మంజూరయ్యే నిధులను అధికారులు దుర్వినియోగం చేయకుండా అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. మండల ప్రజలు తాగునీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావించడంతో.. ఎంపీడీఓ శామ్యూల్‌తోపాటు ఇతర అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలానికి మంజూరైన నిధుల్లో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని చెప్పారు. యాచవరంలో 40 చెంచు కుటుంబాలు వారు ఎమ్మెల్యేను కలిసి తమకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు మంజూరు చేయించాలని కోరగా తాను జనవరి మొదటి వారంలో శ్రీశైలం ఐటీడీఏ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
 
 మాగుటూరులో టీడీపీ నేత కర్ణం కాశయ్య వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాశయ్య నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షించాలని కోరగా.. ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ శామ్యూల్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ ఏరువ రంగారెడ్డి, నారు అశోక్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మొహీద్దీన్‌పురం సర్పంచ్ బండారు రంగారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలిరెడ్డి, అయ్యవారిపల్లి సర్పంచ్ బాలరంగాచారి, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శామ్యూల్, రమేష్‌రెడ్డి, పశువైధ్యాధికారి హరిబాబు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement