మంచి మిత్రుడిని కోల్పోయాం.. | Sakshi
Sakshi News home page

మంచి మిత్రుడిని కోల్పోయాం..

Published Thu, Dec 25 2014 2:42 AM

మంచి మిత్రుడిని కోల్పోయాం..

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించిన మోహన్‌బాబు
 
తిరుపతి (మంగళం): ‘‘తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ఇద్దరం చదువుకున్నాం.. స్టేజీలపై నాటకాలు వేశాం.. సినిమాల్లో నటించాం. ఎక్కడ ఎప్పుడు కలసినా చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని నవ్వుకునేవాళ్లం. అలాంటి మంచి మిత్రుడిని కోల్పోయాం’’అని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం వెంకటరమణ సతీమణి సుగుణ, అల్లుడు సంజయ్, కుమార్తెలను మోహన్‌బాబు పరామర్శించారు.

శత్రువునైనా ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని, పోయిన వ్యక్తిని తీసుకురాలేమని, అతని ఆశయాల కోసం మీరు మనోధైర్యాన్ని కోల్పోకూడదని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణం చెందిన సమయంలో తాను అందుబాటులో లేని కారణంగా అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. అయితే ఆయన మృతి తిరుపతి ప్రజలకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ డెరైక్టర్ బాలచందర్ మృతి సినీ రంగానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని కోరుకున్నానన్నారు.
 

Advertisement
Advertisement