మహిళ సజీవ దహనం | Sakshi
Sakshi News home page

మహిళ సజీవ దహనం

Published Mon, Nov 4 2013 1:12 AM

మహిళ సజీవ దహనం - Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: దీపావళి పండుగపూట హైదరాబాద్‌లోని పం జాగుట్ట ప్రాంతంలో ఓ ఇంట్లో విషా దం అలముకుంది. టపాసు వచ్చి గుడిసెపై పడడంతో అది పూర్తిగా దగ్ధమై, అందులో నిద్రిస్తున్న ఓ మహిళ సజీవ దహనమైంది. స్థాని కులు స్పందించి మంటలను ఆర్పేయడంతో చుట్టుపక్కల వారికి ప్రమా దం తప్పింది. వివరాలు.. పంజాగుట్ట పరిధిలోని రామకృష్ణనగర్ కాలనీలో కన్నబోయిన సంఘమేశ్వర్, అతని భార్య నాగమణి(50) లు ఓ గుడిసెలో నివసిస్తున్నారు. వీరి పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో వీరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. సంఘమేశ్వర్ శనివారం మెదక్ జిల్లా బాచుపల్లికి వెళ్లడంతో నాగమణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు.
 
 ఇదిలావుంటే, శనివారం అర్ధరాత్రి సమయంలో దీపావళి టపాసు స్కైలాంప్ జీవీకే వైపు నుంచి దూసుకువచ్చి నాగమణి ఉన్న గుడిసెపై పడింది. దీంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పంటుకుంది. అయితే, గాఢనిద్రలో ఉన్న నాగమణి ఈ ప్రమాదం గ్రహించేలోగానే మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇంట్లోని టీవీ, ఫ్యాను, గ్యాస్ స్టౌ, మంచం, బట్టలు, ఇతర వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సమయంలో నాగమణి గుడిసెను ఆనుకుని ఉన్న జలేందర్‌కు చెందిన గుడిసెకూ నిప్పంటుకుంది. మంటలు టీవీకి అంటుకుని అది పేలిపోవడంతో జలేందర్ మేల్కొని చూడగా గుడిసె సగభాగం అప్పటికే కాలిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులను బయటకు పంపి, చుట్టుపక్కల వారిని నిద్రలేపి జలేందర్ మంటలను ఆర్పివేశారు. ఇదే ఘటనలో నాగమణి గుడిసెకు ఎదురుగా ఉన్న ఇంట్లో కరెంట్ మీటర్ పూర్తిగా, ఇంటితలుపులు స్వల్పంగా కాలిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలిబూడిదైన నాగమణి అస్థికలను ఓ గుడ్డలో చుట్టుకుని పోస్టుమార్టానికి పంపారు.

Advertisement
Advertisement