నిశ్చితార్థమైన వారానికే.... | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థమైన వారానికే....

Published Mon, Mar 3 2014 8:52 AM

నిశ్చితార్థమైన వారానికే.... - Sakshi

  *కాబోయే భర్త అదనపు కట్నం కోసం డిమాండ్
 *వివాహం నిలిచిపోతుందని యువతి ఆత్మహత్య

 
 ఓర్వకల్లు : నిశ్చితార్థమైన వారానికే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్తే అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడంతో పెళ్లి ఆగిపోతుందని యువతి అఘాయిత్యానికి పాల్పడింది. కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని మయూరి గ్రీన్ హిల్స్‌లోని 439వ ప్లాట్‌లో శంకరాజు, సరస్వతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె హరిప్రియ(22)కు ఖమ్మం జిల్లా, భద్రాచలం పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాసరాజుకు వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.6 లక్షల నగదు, 15 తులాల బంగారు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

నిశ్చితార్థమైన రెండు రోజుల తర్వాత రూ.10 లక్షలు నగదు, 20 తులాలు బంగారు ఇవ్వాల్సిందేనని వరుడు ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆదివారం కూడా హరిప్రియతో ఫోన్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తన పెళ్లి రద్దు అవుతుందేమోనని మనస్తాపానికి లోనైన యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి తల్లి సరస్వతమ్మ ఉలిందకొండలో ఉపాధ్యాయురాలుగా, తండ్రి శంకరాజు కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లి ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విషయంపై ఎస్‌ఐ విజయలక్ష్మీని వివరణ కోరగా మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement