నరసరావుపేట రూరల్, న్యూస్లైన్ :మండలంలోని కేసానుపల్లిలో నరసరావుపేట - చిలకలూరిపేట ప్రధాన రహదారిపై ఓ మహిళ బస్సు కింద పడి దుర్మరణం చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం చిలకలూరిపేట మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన జవ్వాజి విజయ (48) అదే గ్రామంలో ఆర్ఎంపీగా వైద్యుడు ఆదినారాయణలు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గంమధ్యలో కేసానుపల్లి గ్రామంలోకి రాగానే వీరి ముందు వెళుతున్న ఓ ఐస్క్రీం కంపెనీకి చెందిన టాటా ఎస్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా నడిరోడ్డుపై వాహనాన్ని నిలిపాడు.
వెనుక వాహనాలు వస్తున్నాయా రావడం లేదా అని గమనించుకోకుండా డోర్ తీశాడు. ఈ విషయాన్ని గ్రహించని ఆదినారాయణ వాహనం ఆటో డోర్కు తగిలి పల్టీ కొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న విజయ రోడ్డుపై పడింది. అదే సమయంలో నరసరావుపేట నుంచి చీరాల వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ద్విచక్రవాహనం నడుపుతున్న ఆదినారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన ఆదినారాయణను 108 సిబ్బంది ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రోడ్డు పక్కన చింతకాయలు కోసుకునేందుకు డ్రైవర్ నడిరోడ్డుపై ఆటో నిలిపాడని స్థానికులు తెలిపారు.