చీపురుపల్లి: రాష్ట్రంలో పరిపాలన పడకేసింది... మూడున్నర సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు సరికదా టీడీపీ నాయకులు పంచభూతాలను కూడా అమ్ముకుంటున్నారు.. ఐదు నెలలుగా రాష్ట్రానికి ఉపాధి నిధులు మంజూరుకాకపోతే కేంద్రమంత్రి అశోక్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన మంత్రి సుజయ్కృష్ణ రంగారావు జిల్లా సంగతి పక్కన పెడితే కనీసం బొబ్బిలి నియోజకవర్గంలో ఒక్క శంకుస్థాపన చేసిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల వంగపల్లిపేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్ష ఇళ్లు కట్టించామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే తన హయాంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే 2.8 లక్షల ఇళ్లు కట్టించానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పాలనలో అమలయ్యే సంక్షేమ పథకాలు పక్కగా అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. 2004 నుంచి 2009 వరకు ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా తానున్నానని ముందుకు వచ్చిన మహానుభావుడు రాజశేఖరరెడ్డి అని అన్నారు. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో ఆ భరోసా ప్రజలకు కరువైందన్నారు.
ఈ నేపథ్యంలో ఆ భరోసాను కల్పించేందుకే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నవరత్నాలు పథకాలతో మీ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం అంటూ అమలుకాని హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. పేదవాడికి ఉపాధి కల్పించాలని రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి పథకాన్ని అమలు చేస్తే నేటి టీడీపీ నాయకులు తమ ఉపాధికి ఆ పథకాన్ని వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
ఐదు నెలలుగా ఉపాధి వేతనదారులకు వేతనాలు రాకపోతే కనీసం పట్టించుకున్న వారు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన అశోక్గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు పేదల కష్టాలు పట్టడం లేదన్నారు. దీనికి తోడు ఇద్దరు ఎంపీలు ఫిర్యాదు చేయడంతోనే ఉపాధి నిదులు నిలిచిపోయాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో తోటపల్లి ప్రాజెక్ట్ పనులు 89 శాతం పూర్తయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో 11 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు.
తెలుగుదేశం నేతలు మాదిరిగా మాయమాటలు చెప్పడం తమకు చేతకాదని, ఓట్లు వేసి గెలిపించే ప్రజలకు అభివృద్ధి పనులు చేయడమే తమ బాధ్యతగా భావిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రహదారులు, తాగునీటి పథకాలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, టీటీడీ కల్యాణ మంటపం, సెంటర్ లైటింగ్, అమ్మవారి ఆలయం అభివృద్ధి, తదితర పనులెన్నో బొత్స సత్యనారాయణ హయాంలో జరిగాయన్నారు. మూడున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తూనే వస్తోందని.. 2019లో జగన్మోహన్రెడ్డికి మద్దతు ఇస్తే సంక్షేమ పరిపాలన అందుతుందని చెప్పారు.