ప్రేమించాలని వేధిస్తున్నాడు | Sakshi
Sakshi News home page

ప్రేమించాలని వేధిస్తున్నాడు

Published Tue, Oct 22 2019 9:54 AM

Young Man Harassing A Young Woman In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: ఇంటర్‌మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమార్తెను ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడని మాచవరం మండలానికి చెందిన ఓ మహిళ సోమవారం స్పందన కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం... ఆమె భర్త 16 ఏళ్ల క్రితం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఒక కుమార్తె, కుమారుడు సంతానం. కష్టపడి ఇద్దరినీ చదివిస్తోంది. కుమార్తెను ఈ ఏడాది గుంటూరులోని ఓ మహిళా కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేర్పించింది. అయితే మహిళ ఉంటున్న ప్రాంతానికి చెందిన యువకుడు రాతల వెంకటేశ్వర్లు నాయక్‌ ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడి వేధిస్తున్నాడు.

ఈనెల మొదటి వారంలో దసరా సెలవులకు హాస్టల్‌ నుంచి తన కుమార్తె ఇంటికి రాగా, పెళ్లికి అంగీకరించాలని, లేకుంటే యాసిడ్‌ పోస్తానని బెదిరించాడని, ఈ విషయం పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఎస్‌ఐ ఆ యువకుడిని హెచ్చరించి పంపించి వేశారన్నారు. అయితే తదనంతరం ఆ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు తమపై దాడికి పాల్పడ్డారని, ఈ సంఘటనలో తన కుమారుడికి కుడి వైపు కాలర్‌బోన్‌ విరిగిపోయిందని చెప్పారు. దాడి విషయం తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ మహిళ వాపోయింది. వెంటనే విచారించి చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. 

Advertisement
Advertisement