కువైట్‌లో భారతీయులను స్వస్థలానికి రప్పించండి | Sakshi
Sakshi News home page

కువైట్‌లో భారతీయులను స్వస్థలానికి రప్పించండి

Published Wed, May 20 2020 12:14 PM

YS Avinash Reddy Leter to Central Minister For AP People in Kuwait - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల: లాక్‌డౌన్‌ కారణంగా కువైట్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్‌కు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కువైట్‌లో  వీసాల గడువు మించిపోతున్న భారతీయులు దాదాపు 10వేల మంది ఉన్నారన్నారు. వారిని కువైట్‌ ప్రభుత్వం సొంత ఖర్చులతో ఇండియాకు పంపేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఇండియాకు సంబంధించిన 10వేల మంది వలస కార్మికులలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2,500మంది ఉన్నారన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. వీరందరికి అక్కడి కువైట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇబ్బందులు పడకుండా వారిని సొంతూళ్లకు చేర్చవలసిన బాధ్యత ఉందన్నారు.  వెంటనే కువైట్‌లోని భారతీయులను ఇండియాకు తీసుకొచ్చి.. ఆయా రాష్ట్రాలకు  పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను చెన్నై లేదా విజయవాడ విమానాశ్రయాలకు చేరిస్తే అక్కడ నుంచి వారిని  స్వస్థలాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వానికి వీలుంటుందని ఆయన కేంద్ర మంత్రికి లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement