సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. జననేత వైఎస్ జగన్ బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మంగళవారం రోజు వచ్చిన జనసముద్రం బుధవారం రోజు కూడా కొనసాగింది. తమ బిడ్డను చూడటానికి తల్లిదండ్రలు, మనుమడితో మాట్లాడటానికి అవ్వాతాతలు, అన్నతో కష్టాలు చెపుకోవడానికి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు తరలివచ్చారు. వారందరికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రైల్వే ష్టేషన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్, లక్ష్మీనరసింహా నగర్ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్ అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
మంగళవారం రోజున.. గోదావరికి ముందుగానే వరద వచ్చిందా.. అన్నట్లుగా కొవ్వూరు–రాజమహేంద్రవరం మధ్య అఖండ గోదావరిపై రాజన్న బిడ్డకు ప్రజలు జననీరాజనం పలికారు. గోదావరి ఉప్పెనలా.. రోడ్డు కం రైల్ బ్రిడ్జిపై జనం జననేతను చూడటానికి పోటెత్తారు. 4.1 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. భారీ సంఖ్యలో పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు బ్రిడ్జిపై వైఎస్ జగన్తో అడుగు వేశారు. కేరింతలు కొడుతూ యువత తమ నాయుకుడిని చూడటానికి గోదావరి వరదలా తరలివచ్చారు. రోడ్డు కం బ్రిడ్జి నుంచి మొదలు పెడితే రాజమండ్రి బహిరంగ సభ వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని గోదావరి ప్రజలు అక్కున చేర్చుకున్నారు.