సోమయాజులు భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళులు | Sakshi
Sakshi News home page

సోమయాజులు భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళులు

Published Sun, May 20 2018 7:43 AM

YS Jagan Leaves For Hyderabad Pays Tribute To Somayajulu Deaths - Sakshi

సాక్షి, గోపాలపురం : వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు  కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని ఆయన.. హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. మెహిదీపట్నంలోని డీఏ సోమయాజులు నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. ఆయన భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం సోమయాజులు కుటుంబసభ్యుల్ని వైఎస్‌ జగన్‌ ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా సోమయాజులు నివాసానికి వచ్చారు. సోమయాజులు కుటుంబసభ్యులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ప్రశాసన్‌ నగర్‌లోని ‘మహాప్రస్థానం’ శ్మశానవాటికలో డీఏ సోమయాజులు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. డీఏ సోమయాజులు గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు.
 

Advertisement
Advertisement