సాక్షి, నిడదవోలు :ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొలదీ సమయం పడుతుండటంతో వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఆటో నడిపిన వైఎస్ జగన్..
పాదయాత్ర ఉండ్రాజవరంలోకి ప్రవేశించగానే వైఎస్ జగన్ను అక్కడి ఆటో కార్మికులు కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. దీంతో ఆటో కార్మికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ పట్ల ఆటోకార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడే ఓ చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు.
జననేతను కలిసిన పొగాకు రైతులు
కామాయపాలెంలో వైఎస్ జగన్ను పొగాకు రైతులు మద్దతు ధర లేదని ఆవేదన చెందారు. తమ నివాసాలు కూల్చి రోడ్డును పడేశారని పైడిపర్రు నిర్వాసిత మహిళలు జననేత దృష్టికి తీసుకొచ్చారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తణుకు చేనేత కార్మికులు వైఎస్ జగన్ను విన్నవించుకున్నారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.