ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి | Sakshi
Sakshi News home page

ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి

Published Tue, Dec 24 2013 2:40 AM

ys jagan with activists,fans

పులివెందుల, న్యూస్‌లైన్: ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. ఉద్యోగాలు.. ఉపాధి కోసం చాలామంది అవస్థలు పడుతున్నారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి.. అన్ని మంచి రోజులు వస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అనంతపురం జిల్లా గోరంట్ల, నెల్లూరుకు చెందిన ముస్లిం సోదరులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలుసుకున్నారు.
 ఈ సందర్భంగా వారినుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ కొంత కాలం ఓపిక పడితే.. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందన్నారు.
 వైఎస్‌ఆర్ హయాంలోనే ముస్లింల అభివృద్ధికి పెద్ద పీట
 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్ద పీట వేశారని వైఎస్ జగన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత  వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు.
 ముస్లింల సంక్షేమం కోసం  వైఎస్‌ఆర్ అనుక్షణం పరితపించారన్నారు. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఇనయతుల్లా  ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు.
 సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనండి :
 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ చేపట్టే ప్రతి ఆందోళన కాార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు.
 కాంట్రాక్టు
 కార్మికులను పర్మినెంటు చేయండి :
 ఆర్టీపీపీతోపాటు ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్  చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.  ఆర్టీపీపీతోపాటు పలు సంస్థలలో పనిచేస్తున్న సుమారు 100మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు వచ్చి వైఎస్ జగన్‌ను  కలవడంతోపాటు  వినతి పత్రం సమర్పించారు.  ఒక్క ఆర్టీపీపీలోనే 1280మంది కాంట్రాక్టు కార్మికులు అంకితభావంతో పనిచేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని వైఎస్ జగన్ సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులు వైఎస్ జగన్‌కు తమ గోడును వెల్లబోసుకున్నారు.

 ఒకనాడు నష్టాలలో ఇబ్బందులు పడుతున్న ఏపీ జెన్‌కో నేడు లాభాలలో పయనించడానికి కాంట్రాక్టు కార్మికుల కృషి ఎంతైనా ఉందన్నారు. జగన్‌కు వినతి పత్రం అందించిన వారిలో చైర్మన్ మూలే పుల్లారెడ్డి, కో-చైర్మన్లు రామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, కన్వీనర్ సుబ్బిరెడ్డి, కో-కన్వీనర్ సూరిబాబు, గంగయ్య, నాగార్జునరెడ్డి, సుబ్బరాయుడు, రమణమూర్తి, కోశాధికారి నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.
 వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో కాసేపు :
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ కాసేపు గడిపారు. పులివెందులలోని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన జగన్ అక్కడ వైఎస్ భాస్కర్‌రెడ్డి, యువజన విభాగపు నాయకులు వైఎస్ అవినాష్‌రెడ్డిలతో మాట్లాడారు.
 జగన్‌ను కలిసిన పలువురు
 ఎమ్మెల్యేలు, నేతలు :
 పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్ సీపీ కీలక నేతలు వచ్చి చర్చించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, సీజీసీ సభ్యులు, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, కడప నియోజకవర్గ నాయకులు అంజాద్ బాషా, కాల్‌టెక్స్ హఫీజుల్లా, సునీల్‌కుమార్, అధికార ప్రతినిధులు చవ్వా సుదర్శన్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కర్నూలు జిల్లా బనగానపల్లె వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, యల్లనూరు మండల నాయకులు పెద్దారెడ్డి, పులివెందుల నియోజకవర్గ మండలాల కన్వీనర్లు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వై.వి.మల్లికార్జునరెడ్డి, పి.వి.సుబ్బారెడ్డి, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేముల మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, పరిశీలకులు బలరామిరెడ్డి, రామమునిరెడ్డి, యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మరకా శివకృష్ణారెడ్డి, యూత్ కన్వీనర్ శివశంకర్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బోనాల వెంకట్రామిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, నీలకంఠారెడ్డి, సోమశేఖరరెడ్డిలతోపాటు పలువురు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ను కలిశారు.
 జగన్‌తో ఎమ్మెల్యే గురున్నాథరెడ్డి, సీజీసీ సభ్యుల చర్చలు :
 పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ జగన్‌తో  అనంతపురం ఎమ్మెల్యే గురున్నాథరెడ్డి, సీజీసీ సభ్యులు పైలా నరసింహయ్య, గిర్రాజు నగేష్ తదితరులు భేటీ అయ్యారు. అనంతపురానికి  చెందిన రాజకీయాలతోపాటు  అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement
Advertisement