సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు ముగిసింది. నేటి (ఆదివారం) ఉదయం వైఎస్ జగన్ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభం కాగా, సాయంత్రం గాండ్లపెంటలో ముగించారు. పాదయాత్రలో భాగంగా నేడు 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న జగన్ ఓవరాల్గా 605.1 కి.మీ పాటు యాత్ర కొనసాగించారు. ఆదివారం యాత్రలో మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్ జగన్ చేరుకున్నారు. కటారుపల్లిలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకున్నారు. అనంతరం 3.30 గంటలకు పాదయాత్రను ప్రారంభించి కటారుపల్లి నుంచి గాండ్లపెంట గ్రామానికి చేరుకున్నారు. గాండ్లపెంటలో కళ్యాణదుర్గం న్యాయవాదులు వైఎస్ జగన్ను కలుసుకుని న్యాయదేవ విగ్రహాన్ని బహుకరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు దాదాఖలందర్, దేవేందర్లు వైఎస్ జగన్ను కోరారు. రాత్రి అక్కడే వైఎస్ జగన్ బస చేయనున్నారు. నేడు వైఎస్ జగన్ 13.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు.
రేపు ప్రజాసంకల్పయాత్రకు విరామం
రేపు (సోమవారం) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు విరామం పలికారు. ఎల్లుండి (డిసెంబర్ 26న) గాండ్లపెంట నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్నట్లు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.