మీ ఆడపడుచును ఆదరించండి | Sakshi
Sakshi News home page

మీ ఆడపడుచును ఆదరించండి

Published Fri, Dec 6 2013 2:13 AM

మీ ఆడపడుచును ఆదరించండి - Sakshi

పుత్తూరు రూరల్, న్యూస్‌లైన్ : ‘మీ ఆడపడుచుగా భావించి నన్ను ఆదరించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా కోరారు. ఆమె గురువారం గేట్‌పుత్తూరు 5వ వార్డులో గడప గడపలో ఒకే నినాదం వైఎస్సార్ కాంగ్రెస్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండవ రోజు ఆమెకు మహిళలు అఖండ స్వాగతం పలికారు. ఆమెకు శాలువలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ సందర్భంగా రోజా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. తెలుగు జాతిలో చిచ్చు పెట్టి వేడుక చూస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య నినాదంతో ముందుకెళుతోందన్నారు.

జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో మురుకులు కాలుస్తూ తమను ఆదరించాలని అభ్యర్థించారు. జిల్లా కన్వీనర్ కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య వాదని, సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశంలోని అన్ని పార్టీల నాయకులు, అధ్యక్షుల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు.

సమైక్యవాది ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ, విభజన వాదానికి ఆజ్యం పోసిన మూలకారకుడు చంద్రబాబని ఆరోపించారు. అధిష్టానం ఆదేశాల మేరకు రోజుకొక ప్రకటన చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని రాయలసీమ ప్రజలు క్షమించరన్నారు. బ్రదర్ అనిల్‌కుమార్ తండ్రి మృతిపై సంతాపం తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రోజా ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement