సాగునీటికి సమరం.. వైఎస్సార్‌సీపీ నేతల దర్నా | Sakshi
Sakshi News home page

సాగునీటికి సమరం.. వైఎస్సార్‌సీపీ నేతల దర్నా

Published Tue, Nov 27 2018 2:34 PM

ysrcp leader strike for water, kadapa - Sakshi

కడప కార్పొరేషన్‌ : కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిఆధ్వర్యంలో కదం తొక్కారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ పోరుబాట పట్టారు. సోమవారం కొత్త కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.  


అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షల కోట్లు దిగమింగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ‘కరువుపై పోరు’పేరుతో మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరువు, బాబు కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు రక్కసి కరాళనృత్యం చేస్తుందన్నారు. ఒక్క శ్రీకాకుళం తప్ప రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతోందన్నారు. శ్రీకాకుళంలో మాత్రమే వరదలు వచ్చి అతివృష్టి సంభవించిందన్నారు. ప్రస్తుత  కరువు గంజికరువు, ధాతు కరువును మించిపోయిందని రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు.   లక్షల కోట్లు దిగమింగడానికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

విభజనకు ముందు రాష్ట్రానికి రూ.60వేల కోట్ల అప్పులుంటే, ప్రస్తుతం అదనంగా రెండుల లక్షల కోట్లు ఉన్నాయన్నారు. సర్వరాయ సాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఉద్యమించి సాధించుకున్నామని, ఇప్పుడు పాపాఘ్ని నదికి కూడా నీటిని విడుదల చేసే వరకు పోరాటం ఆగదన్నారు. మైలవరం దక్షిణ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ప్రతిరైతుకు ఏటా రూ.12,500 పెట్టుబడి కోసం ఇవ్వడం జరుగుతుందని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో కమలాపురం నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మారుస్తామని, ప్రతి రైతు ఏటా రూ.4 లక్షలు సంపాదించేలా చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, అఫ్జల్‌ఖాన్, టీఎస్సార్, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, యువజన జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రైతు నాయకులు  రాజేంద్రనాథ్‌ రెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, బాలమల్లారెడ్డి, ఉత్తమారెడ్డి, జీఎన్‌ భాస్కర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌ నాయక్, ఖాజా, దేవిరెడ్డి ఆదిత్య, టీపీ వెంకటసుబ్బమ్మ, శ్రీలక్ష్మి, రత్నకుమారి, సీహెచ్‌ వినోద్, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ తీరువల్లే బీమా సొమ్ము రైతులకు రాలేదు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే 2012–13లో శనగ పం టకు సంబంధించిన రూ. 120 కోట్ల  పంటల బీమా రైతులకు రాకుండా పోయిందని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నా రు.  రాష్ట్ర వాటా చెల్లిస్తే తాము మిగతా మొత్తాన్ని ఇస్తామని కేంద్రం లేఖ రాసి రెండేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖకు సమాధానం ఇవ్వలేదన్నారు.  

జిల్లాలో ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని,. ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చినా ఆ నీటిని గండికోటకు, బ్రహ్మంసాగర్‌కు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందన్నారు. మొగమేరు వంక ద్వారా పాపాఘ్ని నదికి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి కమలాపురం నియోజకవర్గంలోని వీఎన్‌ పల్లి, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం మండలలాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నారు.


అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్నిసర్వనాశనం చేశారు: సురేష్‌బాబు
రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని  వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు కృష్ణాజలాలు తేవాలని వైఎస్‌ఆర్‌ పరితపించారని, ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీతో కూడా పోరాడి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారన్నారు.

వెలిగల్లు, బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి వెలిగల్లులో 5 టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 11 టీఎంసీలు నిల్వ ఉంచారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గండికోట ముంపువాసులకు పరిహారం ఇవ్వలేదని, శ్రీశైలం రిజర్వాయర్‌కు 210టీఎంసీల వరద వచ్చినా జిల్లాలోని ప్రాజెక్టులకు చుక్క నీరివ్వలేదని దుయ్యబట్టారు. 
చంద్రబాబు ప్రస్థానమే 


అధర్మంతో మొదలైంది: అంజద్‌బాషా
సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే అధర్మంతో మొదలైందని, ధర్మం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆయనకు ధర్మపోరాట దీక్షలు చేసే అర్హత లేదని కడప శాసనసభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. బాబు గత తొమ్మిదేళ్లపాలనలో ఏడేళ్లు కరువులు వచ్చాయని, ఇప్పుడు నాలుగేళ్లు కూడా రైతులు కరువుతో అల్లాడుతున్నారన్నారు.  మరోసారి చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో వ్యవసాయమే ఉండదన్నారు. 


సీఎం, అతని బినామీలు రాష్ట్రాన్ని లూటీ చేశారు: దుగ్గాయపల్లె
ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని బినామీలైన సీఎం రమేష్, సుజనా చౌదరిలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టులకు శిలాఫ లకాలు వేశారే తప్ప ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు.

పాపాఘ్నికి నీటిని విడుదల చేయాలని రెండు నెలలుగా వినతిపత్రాలు ఇస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అతివృష్టి, అనా వృష్టితో రైతులు అల్లాడుతుంటే సీఎం బోటు రేసులు, విమాన విన్యాసాల కోసం రూ.400కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు. 120 డొల్ల కంపెనీలు పెట్టి  రూ.5700కోట్లు రుణం తీసుకొని బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి విషయంలో సీఎం ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. 


చంద్రబాబులాంటి వ్యక్తి సీఎంగా అవసరం లేదు: పి. సుబ్బారెడ్డి
చంద్రబాబు రాయలసీమ వాసి అయినా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్‌ఆర్‌ 90 శాతం ప్రాజెక్టులను పూర్తి చేస్తే అందులో సీఎం జలహారతులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నదుల అనుసంధానం పేరుతో వేలకోట్లకు టెండర్లు పిలిచి కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదినారాయణరెడ్డి, బుద్దావెంకన్న, చింతమనేని, దేవినేని ఉమా లాంటివారిని చుట్టూ పెట్టుకొని సీఎం అరాచకాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

సాగు నీరిచ్చి రైతులను ఆదుకోండి

 పైడిపాళెం నుంచి కృష్ణాజలాలను పాపాఘ్ని నదికి విడుదల చేయాలని, సర్వరాయ సాగర్‌ నుంచి పాగేరు వంకకు కూడా నీటిని విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పి.  రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, అంజద్‌బాషా,  మల్లికార్జునరెడ్డి కోరారు. ధర్నా అనంతరం వారు జేసీ–2 శివారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సాగునీరు విడుదల చేసి వీఎన్‌పల్లి, పెండ్లిమర్రి, కమలాపురం, వల్లూరు మండలాల రైతులను ఆదుకోవాలన్నారు. సర్వరాయసాగర్‌ నుంచి పాగేరు వంకకు నీటిని విడుదల చేస్తే వీఎన్‌పల్లె, యర్రగుంట్ల, కమాపురం మండలాల్లోని అనేక గ్రామాలకు తాగునీటి కొరత తీరుతుందన్నారు. మైలవరం దక్షిణ కాలువ నుంచి వస్తున్న 100 క్యూసెక్కుల నీటిని 300 క్యూసెక్కులకు పెంచాలన్నారు. కరువు మండలాల్లో సహాయ చర్యలు చేపట్టాలని, 2012, 2014, 2015,2016 సంవత్సరాల్లో రావాల్సిన ఇన్‌స్రూ?న్స్, పెట్టుబడి రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు అఫ్జల్‌ఖాన్, పులి సునీల్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement