రైతుల బాధలు తెలుసు కాబట్టే ధర్నా | Sakshi
Sakshi News home page

రైతుల బాధలు తెలుసు కాబట్టే ధర్నా

Published Sun, Nov 19 2017 8:46 AM

ysrcp leaders Condemned Speaker Kodela Dharna - Sakshi

నరసరావుపేట: ధర్నాలో పాల్గొన్న వారికి మాగాణి, మెట్టకు తేడా తెలియదని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చులకనగా మాట్లాడటం రైతులను అవమానించడమే అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.  తామందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారిమేనని అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. 

నరసరావుపేట మార్కెట్‌ యార్డులో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండించారు. ఈ ప్రాంతంలోని వారందరికీ మాగాణి, మెట్ట గురించి క్షుణ్ణంగా తెలుసునని, ఈ ప్రాంతమంతా రెండు పంటలు పండిన భూములేనన్నారు. ప్రస్తుతం కరువు నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులే ప్రభుత్వంపై సాగునీటి కోసం పోరాడాలని తమను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అవసరమైతే డ్యామ్‌ గేట్లు ఎత్తయినా నీరు విడుదల చేస్తామని తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల కోసం కేసులు పెట్టినా భరిస్తామన్నారు. వెనుకంజ వేసే ప్రసక్తేలేదన్నారు. 

 నరసరావుపేటలో ఎక్కడ ఇసుక, మట్టి ట్రాక్టర్లు, లారీలు కనిపించినా వారిని భయపెట్టి గుంటూరు గుంట గ్రౌండ్‌లో టీడీపీ నాయకులు నిర్మించే భవనం కోసం వాటిని తరలిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వారికి కనీసం కూలి కూడా ఇవ్వకపోవడం నిజం కాదా? అని అన్నారు. కోటప్పకొండలో క్రషర్‌ మెషిన్‌ పెట్టి ఇతర క్రషర్ల యజమానులను భయపెట్టి తన కుమారుడి వద్దనే కంకర కొనాలని హుకుం జారీ చేసింది నిజం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ నెల 14న ధర్నాలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నకరికల్లు మండల అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, రాజుపాలెం జెడ్పీటీసీ మర్రి సుందరరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, నకరికల్లు నాయకుడు వంగా రాజగోపాలరెడ్డి ల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement