ఆచంట : లంక గ్రామాల్లోని ప్రజలు కనీస సౌకర్యాలు లేక దుర్భరమైన జీవితం గుడుపుతున్నారని ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆచంట మండలం పెదమల్లం పంచాయతీ అనగారలంకకు పడవ ప్రయాణం చేసి అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి లంక వాసులతో కలిసి పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్ధానాలు ఏమీ అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిరిగానే పితాని కూడా అమలు కాని హామీలు గుప్పించారని ముఖ్యమంత్రి వద్ద నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించకుండా జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు పథకాలు పంపిణీ చేయడం దారుణమన్నారు. త్వరలోనే జగనన్న పాలన వస్తుందని, జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అధికార పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లాంటి పథకాలు అమలు చేసి రాజన్నరాజ్యం తీసుకువస్తామని చెప్పారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు యడ్ల ప్రసాదు, బూత్ కమిటీ అధ్యక్షుడు గంటి వెర్రియ్య, సిర్రా శ్రీరామ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్కుమార్ మండల ఉపాధ్యక్షుడు కామన హరిబాబు, జిల్లా నాయకుడు దేవిరెడ్డి రాంబాబు, నక్కా శివాజీ, కోనాల గంగాధరరెడ్డి, దొంగ దుర్గాప్రసాద్, గొడవర్తి వెంకన్నబాబు గోసాలరాజు తదితరులు ఆయన వెంట పర్యటించిన వారిలో ఉన్నారు.