Sakshi News home page

ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

Published Fri, Jul 31 2015 4:04 AM

ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరుబాట - Sakshi

- కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల:
  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ పోరాటం చేయనుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ దీక్ష చేపడతారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగాఉన్నా చంద్రబా బు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాటాలు చేస్తూనే ఉందన్నారు.

రుణమాఫీ జరగక.. అప్పులు తీరక నిత్యం అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.1. 50లక్షలు మాత్రమే ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం కమిటీల పేరు తో కొన్ని లక్షల మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లలో కోత విధించిందన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ కేవ లం వడ్డీకి కూడా సరిపోక అన్నదాతలు అల్లాడుతున్నారన్నారు. ప్రజ లను అన్నివిధాలుగా మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు మరెంతో దూరం లేదన్నారు.  అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

Advertisement
Advertisement