జులై 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీ | Sakshi
Sakshi News home page

జులై 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీ

Published Fri, Jun 30 2017 5:00 PM

జులై 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీ - Sakshi

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ ప్లీనరీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ప్లీనరీకి సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామన్నారు.

'జాతీయ స్థాయి ప్లీనరీకి దాదాపు 30వేల మంది ప్రతినిధులు వస్తారు. మూడు అంచెల్లో ఈ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించాం. ప్లీనరీ నిర్వహణ కోసం మొత్తం 18 కమిటీలు ఏర్పాటుచేశాం. భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, సభ నిర్వాహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, మీడియా, కల్చరల్, రవాణా, పార్కింగ్ వంటివాటి నిర్వహణకు ఈ 18 కమిటీలు పనిచేస్తాయి. ప్లీనరీ తొలిరోజు(జులై 8)న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజు(జూలై 9)న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామీణ స్థాయి నేతలకే ఎక్కువ తెలుస్తాయి. అందుకే జిల్లా స్థాయి ప్లీనరీలు, నియోజవర్గ స్థాయి ప్లీనరీలు విజయవంతమయ్యాయి. ఆయా ప్లీనరీల్లో తీర్మనాలు మాకు ఎప్పటికప్పుడు అందుతునే ఉన్నాయి. వాటి ప్రాతిపదికనే జాతీయ ప్లీనరీలో చర్చిస్తాం. దశ దిశ కోల్పోయిన వ్యవసాయం, ప్రజా సంక్షేమం, మహిళా, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ సమస్యలు, డ్వాక్రా మహిళలు వారి ఇబ్బందులు, ఎన్నికల హామీల వైఫల్యం, ప్రత్యేక హోదా అంశం, మానవ వనరులు, ఇసుక మాఫియా, మద్యం టెండర్ల అవకతవకలు, రాజధాని భూ సేకరణపై జరుగుతున్న అక్రమాలులాంటి ఎన్నో అంశాలు ప్లీనరీలో చర్చిస్తాం' అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు.

Advertisement
Advertisement