శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా ఎంతో ఆదరణ లభించిందని, వచ్చే ఎన్నికల్లో విజయానికి ఇదే తొలి నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ముగించే వరకు ప్రతి రోజూ ఆయనతో పాటు తాను నడిచానని గుర్తుచేశారు.
ఈ పాదయాత్రకు వెళ్లిన అన్ని చోట్లా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకడంతో పాటు వారి సమస్యలు తెలియజేశారని, ప్రభుత్వం చేతిలో ఎలా మోసపోయామో వివరించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. పాదయాత్ర ముగింపు రోజున ఆశేష జనవాహిని హాజరు కావడం విజయానికి తొలిమొట్టుగా చెప్పుకోవచ్చన్నారు. పాదయాత్ర విజయవంతం చేసిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.