ప్రజలకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ | Sakshi
Sakshi News home page

ప్రజలకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ

Published Mon, May 4 2015 3:58 AM

YSRCP supportive to the people

తిరుపతి మంగళం : ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి ప్రజలకు అండగా నిలుస్తుందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భూమన కరుణాకరరెడ్డి నివాసంలో పోతిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబంలో నుంచి ఎవరైనా పోటీ చేస్తే వారికి పోటీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదన్న నిబంధనలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టడం అభినందనీయమన్నారు.

తాను పార్టీలో ఉంటూ అందుకు బిన్నంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అరాచకాలను చూడలేకే పోటీ చేశానన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి పోటీ చేయడం తప్పని తెలుసుకుని తిరిగి వైఎస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు. పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని అధికార పార్టీని ఎండగట్టేందుకు పార్టీ నాయకులు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి,  టి. రాజేంద్ర, ఎస్‌కె. ఇమామ్‌సాహెబ్, రామస్వామి వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, పోతిరెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement