ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ ‘బెజోస్‌’ | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ ‘బెజోస్‌’

Published Wed, Mar 7 2018 12:38 AM

Amazon founder Jeff Bezos overtakes Bill Gates to top billionaire list - Sakshi

న్యూయార్క్‌: ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నిలిచాడని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ మంగళవారం వెల్లడించింది. జెఫ్‌ బెజోస్‌ ఫోర్బ్స్‌ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఏడాది కాలంలో అమెజాన్‌ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ నిలిచారు. 7,200 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ నాలుగో స్థానంలో, 7,100 కోట్ల డాలర్లతో ఫేస్‌బుక్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఐదో స్థానంలో ఉన్నారు.  

119 మంది సంపన్న భారతీయులు... 
ఇక భారత్‌ విషయానికొస్తే, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 119 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో 18 మంది కొత్తగా ఈ జాబితాకెక్కారు.అత్యంత సంపన్న భారతీయుడైన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌అంబానీ ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19 వస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 4,010 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.2.61 లక్షల కోట్లు) ఉంది. ఈ జాబితాలో 58వ స్థానంలో విప్రో అజిమ్‌ ప్రేమ్‌జీ (1,880 కోట్ల డాలర్లు), 62వ స్థానంలో ఆర్సెలర్‌ లక్ష్మీ మిట్టల్‌ (1,850 కోట్ల డాలర్లు), 98వ స్థానంలో శివ్‌ నాడార్‌ (1,460 కోట్ల డాలర్లు) ఉన్నారు. ఇక సన్‌ ఫార్మా అధినేత దిలిప్‌ సంఘ్వి 1,280 కోట్ల డాలర్ల సంపదతో 115వ స్థానంలో ఉన్నారు. రామ్‌దేవ్‌ అగర్వాల్, తరంగ్‌ జైన్, నిర్మల్‌ మిందా, రవీంద్ర కిశోర్‌ సిన్హాలు ఒక్కొక్కరు వంద కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాకెక్కారు. ఈ జాబితాలో 176 స్థానంలో సావిత్రి జిందాల్‌ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఫార్మా దిగ్గజాలకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. అరబిందో ఫార్మా రామ్‌ ప్రసాద్‌ రెడ్డి 250 కోట్ల డాలర్ల సంపదతో 965వ ర్యాంక్‌ను, దివీస్‌ మురళి 230 కోట్ల డాలర్లతో 1,070వ ర్యాంక్‌ను సాధించారు.  

వందకోట్ల డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు) పైబడిన ప్రపంచ వ్యాప్త సంపన్నులతో ఫోర్బ్స్‌ పత్రిక ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 2,208 మంది సంపన్నులకు స్థానం లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 తర్వాతి షేర్ల ధరలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. గత ఏడాది బిలియనీర్ల జాబితాలో స్థానం పొంది, ఈ ఏడాది ఈ జాబితా నుంచి జారిపోయిన వాళ్ల జాబితాలో పీఎన్‌బీ స్కామ్‌ సూత్రధారి నీరవ్‌ మోదీ ఉండడం విశేషం. గత ఏడాది 7.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న బిలియనీర్ల సంపద ఈ ఏడాది 9.1 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఒక్కో బిలియనీర్‌ సగటు సంపద 4.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.  

Advertisement
Advertisement