ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి.. | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి..

Published Sat, Jan 27 2018 3:52 PM

Annual smartphone shipments in China declined for the first time in 2017 - Sakshi

ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాలమంది. రీసెర్చ్‌ సంస్థ కెనాలిస్‌ అంచనాల  ఎనిమిదేళ్లుగా పెరుగుతూ వచ్చిన చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ , 2017లో వార్షిక సరుకు రవాణాలో ఒక్కసారిగా 4 శాతం క్షీణించినట్టు తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్‌గా ఉన్న చైనాలో, అమ్మకాలు పడిపోవడం టెక్‌ వర్గాలను, కంపెనీలను విస్మయ పరుస్తోంది.  

అయితే స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌లో హువావే, ఒప్పో, వివోలు చైనీస్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్ నేలచూపులు చూస్తే, హువావే మాత్రం రెండంకెల వృద్ధిని సాధించినట్టు కెనాలిస్ రిపోర్టు వెల్లడించింది. కాగ, 2010 నుంచి 2015 వరకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఆపిల్‌, శాంసంగ్‌ల మధ్యే కనిపించేది. కానీ గత రెండేళ్లుగా చిన్న చైనీస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లకు ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడింది. అందుబాటులోని ధర, ఆకట్టుకునే ఫీచర్లతో చిన్న చైనీస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 

చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలలో చాలా మంది వినియోగదారులకు ఐఫోన్, శాంసంగ్‌ గెలాక్సీ వంటి స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ అంత భారీ ధరలను భరించలేని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఫీచర్ ఫోన్లతోనే సరిపెట్టుకుంటున్నారు. వీరికి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని అందించడానికి ఒప్పో, వివోలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న స్టోర్లను కూడా ఏర్పాటుచేశాయి. దీని ఫలితంగా 2016లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బాగానే పెరిదింది. ప్రజలు బేసిక్‌ ఫోన్ల నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలోకి మారాయి.

అసలెందుకు ఈ క్షీణత?
"ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నుంచి తక్కువ ధరలో దొరికే స్మార్ట్‌ఫోన్లకు మారిపోయారు. తమకు ప్రస్తుతం మరో ఫోన్ కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే కొనుగోళ్లు పడిపోయాయి. మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి" అని కెనలిస్‌ విశ్లేషకుడు మో జియా చెప్పారు. 2019లో 5జీ డివైజ్‌లు మార్కెట్‌లోకి వచ్చేంత వరకు చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వృద్ధి ఉండదని ఈ రీసెర్చ్‌ సంస్థ తెలుపుతోంది.

Advertisement
Advertisement