స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

Published Sat, Jul 13 2019 3:17 PM

Court bars Snapdeal from Selling Casio Products - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్‌ ఇచ్చింది. తన బ్రాండ్‌ పేరుతో నకిలీ  ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ  స్నాప్‌డీల్‌పై  కేసు  నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో  ఈ  మేరకు ఢిల్లీలోని తీస్‌  హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది.  దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్‌ వాచెస్‌, కాలిక్యులేటర్‌ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  స్నాప్‌డీల్‌ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ  లీగల్ డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్‌ సతోషి యమజాకి  వెల్లడించారు.
 
అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్‌డీల్ తెలిపింది. ప్లాట్‌ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల  ప్రభావితం  చూపుతోందని స్నాప్‌డీల్ ప్రతినిధి చెప్పారు.  ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్‌ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా,  ఆన్‌లైన్‌లో నకిలీ  ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement