డీసీబీ బ్యాంక్‌ లాభం 24 శాతం డౌన్‌ | Sakshi
Sakshi News home page

డీసీబీ బ్యాంక్‌ లాభం 24 శాతం డౌన్‌

Published Sat, Apr 15 2017 12:45 AM

డీసీబీ బ్యాంక్‌ లాభం 24 శాతం డౌన్‌

23 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని డీసీబీ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.53 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.70 కోట్లతో పోల్చితే 24 శాతం క్షీణత నమోదైందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం పెరిగిందని పేర్కొంది.

2015–16 క్యూ4లో రూ.230 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.284 కోట్లకు పెరిగిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.64 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.51 శాతం నుంచి 1.59 శాతానికి, నికర మొండి బకాయిలు 0.75 శాతం నుంచి 0.79 శాతానికి పెరిగాయని తెలిపింది.

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.307 కోట్లకు, మొత్తం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.1,046 కోట్లకు పెరిగాయని పేర్కొంది.  గురువారం బీఎస్‌ఈలో డీసీబీ బ్యాంక్‌ షేర్‌ 1 శాతం క్షీణించి రూ.180 వద్ద ముగిసింది.  
ఈ నెల 26 నుంచి

రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా లాభం రూ. 7 కోట్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా (ఆర్‌ఐఐఎల్‌) నికర లాభం సుమారు 140 శాతం ఎగిసింది. రూ. 3.04 కోట్ల నుంచి రూ. 7.30 కోట్లకు పెరిగింది. ఇక, ఇతర ఆదాయంతో పాటు మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ. 25.26 కోట్ల నుంచి రూ. 30.90 కోట్లకు పెరిగింది.

మరోవైపు, 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 5.12 శాతం పెరుగుదలతో రూ. 15.62 కోట్ల నుంచి రూ. 16.42 కోట్లకు చేరింది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేరుపై రూ. 3.50 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని ఆర్‌ఐఐఎల్‌ బోర్డు సిఫార్సు చేసింది. దీనితో డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌తో పాటు మొత్తం రూ. 6.36 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement