Sakshi News home page

ఎక్కడైనా ఒకటే రేటు

Published Sat, Jul 8 2017 1:28 AM

ఎక్కడైనా ఒకటే రేటు - Sakshi

స్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్‌ల రేట్లపై కేంద్రం నోటిఫికేషన్‌
మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లలో అధిక ధరలతో విక్రయాలకు చెక్‌
2018 జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి


న్యూఢిల్లీ: శీతల పానీయాలు, స్నాక్స్‌ మొదలైన వాటిని ఎక్కడైనా ఒకే ఎంఆర్‌పీకి విక్రయించాలని, ప్రదేశాన్ని బట్టి అధిక ధరలకు అమ్మరాదని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ద్వంద్వ ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) విధానాన్ని నిషేధిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. దీంతో జనవరి 1 నుంచి విమానాశ్రయాలు, హోటళ్లు, మాల్స్‌ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్నాక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్, వాటర్‌ బాటిల్స్‌ మొదలైన వాటిని అధిక రేటుకు విక్రయించడానికి ఉండదు. మహారాష్ట్ర లీగల్‌ మెట్రోలజీ ఆర్గనైజేషన్‌ (ఎల్‌ఎంవో) విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ద్వంద్వ ఎంఆర్‌పీ విధానాలు పాటించొద్దంటూ కోకకోలా, పెప్సీ, రెడ్‌ బుల్‌ తదితర వినియోగవస్తువుల తయారీ కంపెనీలకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఎల్‌ఎంవో కొత్తగా నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆయా కంపెనీలు వివిధ మార్గాల్లో వీటిని దాటవేసేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో మొదలైన వాటిల్లో విక్రయించే స్నాక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్‌ లాంటి వాటి రేట్లకు.. మాల్స్, హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లాంటి ప్రదేశాల్లో విక్రయించే ధర మధ్య వ్యత్యాసముంటోంది. ప్రీమియం ప్రదేశాల్లో అమ్మే వాటికి వేరుగా అధిక ఎంఆర్‌పీ ముద్రించి కంపెనీలు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ విధానాలు కూడదంటూ గతంలోనూ అనేక సార్లు ఆదేశించినా ఇలాంటి రెండు రకాల ఎంఆర్‌పీ విధానంపై నిర్ధిష్ట చట్టంలో ప్రత్యేక నిబంధనలేమీ లేవంటూ పెద్ద కంపెనీలు కోర్టులకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేవని ఎల్‌ఎంవో కంట్రోలర్‌ అమితాబ్‌ గుప్తా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒకే ఉత్పత్తికి రెండు రకాల ఎంఆర్‌పీలు విధించకుండా సదరు చట్టాన్ని సవరించినట్లు చెప్పారు. ఒకవేళ కంపెనీలు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే... తమకు ఫిర్యాదు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement