బుక్‌మైషోతో ఫ్లిప్‌కార్ట్‌ చర్చలు | Sakshi
Sakshi News home page

బుక్‌మైషోతో ఫ్లిప్‌కార్ట్‌ చర్చలు

Published Mon, Oct 16 2017 12:47 PM

E-ticketing service BookMyShow in talks with Flipkart  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అలీబాబాకు చెందిన పేటీఎంకు ఆన్‌లైన్‌ టిక్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌మైషో కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఇది చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే,  బుక్‌మైషోలో మైనార్టీ వాటా ఫ్లిప్‌కార్ట్‌ సొంతం కాబోతుంది. దీంతో దేశంలో అతిపెద్ద ఈ-టిక్కెటింగ్‌ సర్వీసు అయిన బుక్‌మైషో మరింత బలోపేతమవుతోందని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. మైనార్టీ వాటా అమ్మకం ద్వారా నెమ్మదించిన విక్రయ వృద్ధిని పెంచుకోవచ్చని బుక్‌మైషో చూస్తోంది. అంతేకాక ఇది ఫ్లిప్‌కార్ట్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పేకు కూడా లబ్దిచేకూరనున్నట్టు తెలుస్తోంది.

ఫోన్‌పేలో 500 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయాలని చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ గత వారమే ప్రకటించింది కూడా. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫ్లిప్‌కార్ట్‌ కానీ, బుక్‌మైషో కానీ స్పందించలేదు. బుక్‌మైషో ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈ, న్యూజిలాండ్‌ దేశాల్లో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1999లో ఏర్పాటుచేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, 2007లో రీలాంచ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 350 పట్టణాలు, సిటీల్లో ఇది తన కార్యకలాపాలు సాగిస్తోంది. మూవీలకు, క్రీడలకు, లైవ్‌ ఈవెంట్లకు టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి బుక్‌మైషో యూజర్లకు అనుమతిస్తోంది.

Advertisement
Advertisement