ఎస్సార్ ఆయిల్‌లో రోస్‌నెఫ్ట్‌కు వాటాలు | Sakshi
Sakshi News home page

ఎస్సార్ ఆయిల్‌లో రోస్‌నెఫ్ట్‌కు వాటాలు

Published Thu, Jul 9 2015 2:32 AM

ఎస్సార్ ఆయిల్‌లో రోస్‌నెఫ్ట్‌కు వాటాలు

49% కొనుగోలుకు ప్రాథమిక ఒప్పందం

 ముంబై : రష్యాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ తాజాగా ఎస్సార్ ఆయిల్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఎస్సార్ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన వడినార్ ఆయిల్ రిఫైనరీలో దాదాపు 49 శాతం దాకా వాటాలను రాస్‌నెఫ్ట్ దక్కించుకుంటుంది. ఒప్పందం విలువ సుమారు 6 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.  డీల్‌లో భాగంగా పదేళ్ల పాటు రిఫైనరీకి ఏటా 10 మిలియన్ టన్నుల ముడిచమురును సరఫరా చేస్తుంది. దీంతో భారత రిఫైనింగ్, రిటైల్ మార్కెట్లో రాస్‌నెఫ్ట్ ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది.

అలాగే, కొన్నేళ్ల పాటు తమ ముడిచమురు విక్రయాలకు ఢోకా లేకుండా చూసుకోవడానికి వీలవుతుంది. మరోవైపు, డీల్ కింద వడినార్ రిఫైనరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు, 2020 నాటికి దీన్ని 45 ఎంటీపీఏ స్థాయికి చేర్చనున్నట్లు రాస్‌నెఫ్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎస్సార్ అయిల్‌కు భారత్‌లో 1,600 రిటైల్ బంకులు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటిని 5,000కు పెంచే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులకు ఎస్సార్ ఆయిల్‌లో 90.5 శాతం మేర వాటాలు ఉన్నాయి.

ఎస్సార్ తమ వడినార్ రిఫైనరీకి  కావల్సిన ముడిసరుకు కోసం (రోజుకి 4,00,000 బ్యారెల్స్ (బీపీడీ)) ఎక్కువగా ఇరాన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. తాజా డీల్‌తో కొంత మేర రష్యా చమురు అందుబాటులోకి వచ్చినా.. అధిక రవాణా వ్యయాలు తదితర అంశాల కారణంగా  లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement